Telugu Gateway
Politics

బిజెపి గెలుపు తాత్కాలికమే

బిజెపి గెలుపు తాత్కాలికమే
X

జీహెచ్ఎంసీ మేయర్ పీఠం అంశంపై ఇప్పటివరకూ తమతో ఎవరూ మాట్లాడలేదని, తాము కూడా ఎవరితోనూ చర్చించలేదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ వెల్లడించారు. కొత్తగా గెలిచిన ఎంఐఎం కార్పొరేటర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. మేయర్, డిప్యూటీ మేయర్ అంశంపై ఎవరైనా తమతో మాట్లాడితే తాము పార్టీలో చర్చించి నిర్ణయం తీసకుంటామని తెలిపారు. అసదుద్దీన్ శనివారం నాడు పలు ఛానళ్ల ప్రతినిధులతో మాట్లాడారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో నగర ప్రజలు ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదని తెలిపారు.

పాతబస్తీలో బీజేపీ ప్రభావం లేదని అన్నారు. ముస్లింలు, హిందువులు అందరూ ఎంఐఎంకు ఓటు వేశారని తెలిపారు. అయితే తమ పార్టీకి వచ్చిన ఫలితాలపై సమీక్ష జరుపుతున్నామన్నారు. గ్రేటర్‌లో బీజేపీ గెలుపు తాత్కాలికమేనని, దాని ప్రభావం రాష్ట్రంలో ఉండదని పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రభావం రాష్ట్రంలో ఉండదని, తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌పై ఎనలేని గౌరవం ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌, టీడీపీ బలహీనపడటం వల్లే బీజేపీ ఓట్ల శాతం పెరిగిందన్నారు. పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన తెలిపారు.

Next Story
Share it