బెదిరింపు ఏకగ్రీవాలు కూడా విజయాలేనా?
వైసీపీ సర్కారుపై టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని బెదిరింపులతో చేసుకునే ఏకగ్రీవాలు కూడా ఓ విజయాలేనా? అని ప్రశ్నించారు. వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ గురించి ప్రశ్నించలేని సీఎం జగన్ రాష్ట్రానికి ఇక ప్రత్యేక హోదా ఏమి తీసుకొస్తారని ఎద్దేవా చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు చేపట్టిన నిరాహార దీక్షకు లోకేష్ మద్దతు తెలిపారు. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగేవరకు తీవ్ర ఉద్యమం తప్పదని, ఉద్యమం ఉధృతం చేద్దామని, ప్రైవేటీకరణను ఆపుదామని లోకేష్ పిలుపు ఇచ్చారు. వైఎస్ విజయలక్ష్మిని ఓడించారనే విశాఖ ప్రజలపై సీఎం జగన్ కక్షగట్టారన్నారు.
151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు ఉండి జగన్ ప్రభుత్వం ఏం సాధించిందని లోకేష్ ప్రశ్నించారు. గాడిదలు కాస్తున్నారా? అని ఎద్దేవా చేశారు. బుల్లెట్ లేని గన్.. జగన్ అంటూ నొక్కితే నీళ్లు బయటకు వస్తున్నాయన్నారు. ఆంధ్రులకు అన్యాయం జరిగితే ఉపేక్షించేదిలేదని లోకేష్ స్పష్టం చేశారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో వైసీపీకి మూడనుందని లోకేష్ అన్నారు. జనం ఇంకా వైసీపీ వైపే ఉన్నారని సీఎంకు నమ్మకం ఉంటే.. దమ్ముంటే అధికార దుర్వినియోగం చేయకుండా.. 3,4 విడతల్లో పోటీ చేయాలని, ఎవరి సత్తా ఏంటో తేలుతుందని లోకేష్ సవాల్ విసిరారు.