Telugu Gateway
Politics

ప‌న్ను త‌గ్గించం అని ప్ర‌క‌టించింది జ‌గ‌న్ ఒక్క‌రే

ప‌న్ను త‌గ్గించం అని ప్ర‌క‌టించింది జ‌గ‌న్ ఒక్క‌రే
X

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తీరుపై టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ విమ‌ర్శ‌లు గుప్పించారు. పెట్రోల్, డీజిల్ పై పన్ను భారాన్ని తగ్గించేది లేదంటూ ప్రజా ధనంతో సొంత పత్రికకు ప్రకటనలు ఇచ్చుకొని దోచుకుంటున్న ఘనుడు దేశ చరిత్రలో వైఎస్ జ‌గ‌న్ ఒక్క‌రే అని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు 23 రాష్ట్రాలు పన్ను భారాన్ని తగ్గించి సామాన్యులకు ఊరట కలిగించినా వసూల్ రెడ్డి మాత్రం బాదుడు విషయంలో..వెనక్కి తగ్గనంటూ ప్రకటనలు ఇవ్వడం ఆయన తుగ్లక్ తనానికి నిదర్శనం. అసత్య ప్రకటనలతో ప్రజల్ని నమ్మించాలని ప్రయత్నించి వైకాపా ప్రభుత్వం అభాసు పాలయ్యింది అంటూ విమ‌ర్శించారు. ఈ మేర‌కు నారా లోకేష్ ప‌లు ట్వీట్స్ చేశారు. చంద్ర‌బాబు హ‌యాంలో ప్రజల పై భారాన్ని తగ్గించడానికి రూ.4 వ్యాట్ ని రూ.2కి తగ్గించిన విషయాన్ని..దాచిపెట్టి ఫేక్ ప్రకటన ఇవ్వడం వసూల్ రెడ్డి ఫేక్ బ్రతుకుని మరోసారి బయటపెట్టింద‌న్నారు. యానాం వెళ్లి పెట్రోల్ కొట్టించుకుంటే తేడా తెలుస్తుంది అంటూ చిలక పలుకులు పలికిన మీరు అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ళు అయినా వ్యాట్ ఎందుకు తగ్గించలేదని ప్ర‌శ్నించారు.

కేవలం రూ.1 సెస్ వేసామంటూ అసత్యాలు చెబుతున్నారు. 2020 ఫిబ్రవరి 29న పెట్రోలుపై అదనపు వ్యాట్‌ను రూ.2.76, డీజిల్‌పై రూ.3.07 కు పెంచారు. 2020 జులై 20న, మరోసారి పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు రూ.4 వరకూ అదనపు వ్యాట్‌ పెంచుతూ ఆదేశాలు ఇచ్చారన్నారు. 2020 సెప్టెంబరు 18న, రోడ్డు అభివృద్ధి సెస్ పేరిట లీటరు రూ.1 చొప్పున విధించారు. మళ్లీ దానిపైనా వ్యాట్‌ ఉంది. మొత్తంగా, లీటర్ పెట్రోల్ పై రూ.30 వరకూ, డీజిల్ పై రూ.22 వరకూ పన్నులు రూపంలో బాదుతున్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే పెట్రోల్ పై రూ.7.59, డీజిల్ పై రూ.5.46 వరకు పన్నులు రూపంలో వైకాపా ప్రభుత్వం అధికంగా బాదేసిందని కేంద్రమే చెప్పింది. దేశంలోని అన్ని రాష్ట్రాలకంటే అధికంగా జనాల్ని దోచేస్తున్న వసూల్ రెడ్డి పోసుకోలు కబుర్లు, ఫేక్ ప్రకటనలు మాని తక్షణమే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని లోకేష్ డిమాండ్ చేశారు.

Next Story
Share it