Telugu Gateway
Politics

టీడీపీకి పెద్దిరెడ్డి సంచలన ఛాలెంజ్

టీడీపీకి పెద్దిరెడ్డి సంచలన ఛాలెంజ్
X

ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి సంచలన ఛాలెంజ్ చేశారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే తమ పార్టీకి చెందిన ఎంపీలంతా రాజీనామా చేస్తారని..టీడీపీ ఓడిపోతే ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు రాజీనామా చేస్తారా? అని సవాల్ చేశారు. తిరుపతి ఉప ఎన్నికను తాము రిఫరెండంగానే భావిస్తున్నట్లు తెలిపారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతిలో మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం జగన్ చేపట్టిన ప్రజాహిత కార్యక్రమాలే తమకు ఆయుధమని వ్యాఖ్యానించారు. కోవిడ్‌ తీవ్రత వల్లే ఈనెల 14న సీఎం వైఎస్‌ జగన్‌ సభ వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. బీజేపీకి ప్రజలను ధైర్యంగా ఓటు అడిగే హక్కు లేదని.. విభజన హామీలను నెరవేర్చకుండా ప్రజలను బీజేపీ నేతలు ఎలా ఓట్లు అడుగుతారంటూ పెద్దిరెడ్డి ప్రశ్నించారు. గతంలో ఏపీకి ప్రత్యేక హోదాను చంద్రబాబు తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే దమ్మూధైర్యం ఎప్పుడూ లేదని విమర్శించారు.

ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలు ఏనాడూ పార్లమెంట్‌లో పోరాడలేదని ఆయన మండిపడ్డారు. ''రైతు సంక్షేమం కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. సీఎం జగన్ పాలనలో చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. ప్రజల గుమ్మం వద్దకే సంక్షేమ పథకాల ఫలాలు చేరుతున్నాయి. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా సీఎం జగన్‌ పాలన సాగుతోంది. రాయలసీమ కోసం వేలకోట్ల రూపాయలతో సాగునీటి ప్రాజెక్టులు తీసుకొచ్చాం. యుద్ధప్రాతిపదికన పెండింగ్‌ ప్రాజెక్టుల పనులు సాగుతున్నాయి. చంద్రబాబుకు పవన్‌ కల్యాణ్‌ దత్తపుత్రుడు. ప్రత్యేక హోదాపై సమాధానం చెప్పాల్సింది బీజేపీయే. వైఎస్సార్‌సీపీపై బీజేపీ వ్యాఖ్యలు దిగజారుడుతనానికి నిదర్శనమని'' మంత్రి పెద్దిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వీళ్ల ముగ్గురూ కలసి పోటీచేస్తారన్నారు.

Next Story
Share it