Telugu Gateway
Politics

కెసీఆర్ ఇప్ప‌టిదాకా నిద్ర‌పోయారా?

కెసీఆర్ ఇప్ప‌టిదాకా నిద్ర‌పోయారా?
X

టీఆర్ఎస్ పార్టీ, ముఖ్యంత్రి కేసీఆర్ ఆయన మంత్రులు.. తెలంగాణను కాపాడేందుకు నీళ్ల యుద్ధం చేయబోతున్నట్లుగా కొత్త డ్రామాకు తెరలేపారని సీఎల్పీ నేత మ‌ల్లు భ‌ట్టివిక్ర‌మార్క విమ‌ర్శించారు. మీ కళ్లముందే అన్నీ జరుగుతున్నా నిద్రపోయి.. మీకు సంబంధించిన కాంట్రాక్టర్లకు, ఏజెన్సీలకు మేలు చేసేందుకు రాష్ట్ర ప్రయోజనాలకు ఫణంగా పెట్టార‌న్నారు. ఈ ముఖ్యమంత్రికి ప్రజలు తప్పకుండా బుద్ది చెప్పాల‌ని వ్యాఖ్యానించారు. మ‌ల్లు భట్టివిక్ర‌మార్క బుధ‌వారం నాడు మీడియాతో సీఎం కెసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. అవేంటో ఆయ‌న వ్యాఖ్య‌ల్లోనే... తెలంగాణ చెందాల్సిన చుక్క నీటి బొట్టును కూడా వదులుకోము.. అవసరమైతే యుద్దం చేస్తాం.. అంటూ అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారు. ఏపీ ప్రభుత్వం రాయలసీమ లిప్ట్ సంగమేశ్వరం పేరుమీద నీళ్లు తీసుకునిపోయేందుకు సంవత్సరం కిందటే జీ.ఓ ఇచ్చింది. సంగమేశ్వరం నుంచి రోజుకు మూడు టీఎంసీలు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచి రోజుకు 80 వేల క్యూసెక్కుల నీళ్లు తరలించేందుకు సిద్ధమైంది. ఈ మొత్తం మీద రోజుకు 11 టీఎంసీల నీటిని తీసుకునిపోతున్నారు. తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్ల కోసం. మీరు నిద్రపోతున్నారు.. నిద్రలేవండి.. పోరాటం చేయండని.. మొత్తుకున్నా పట్టించుకోలేదు. దొంగలు పడ్డ అరునెలకు కుక్కలు మోరిగినట్లు.. కుక్కలైనా ఆరునెల్లకు మోరుగుతాయి.. టీఆర్ఎస్ ప్రభుత్వం- నేతలు ఏడాదికి మేలుకున్నారు. ఏపీ ప్రాజెక్టుల వల్ల తెలంగాణకు నష్టం వస్తుందని కాంగ్రెస్ పార్టీ సహా అన్ని పార్టీలు చెప్పాయి. నీటిమీద, నదులు మీద అవగాహన ఉన్న మేధావులంతా చెప్పారు. తెలంగాణ ముుఖ్యమంత్రి కేసీఆర్ పేరుకు మాత్రం తెలంగాణ ప్రయోజనాలు అంటాడు.. కానీ ఆయన కుటుంబ ఆర్థిక ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు ఏమ లేవు. రామలసీమ సంగమేశ్వరం ప్రాజెక్టు పేరుమీద ఏపీ ప్రభుత్వం జీ.ఓ ఇచ్చిన తేదీ.. 5.5.2020. దీనికి సరిగ్గా నెల ముందు 8.4.2020 నాడు మన రాష్ట్ర ఈ.ఎన్.సీ మురళీధర్ రావు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు లిఫ్ట్ సామర్థ్యాన్ని రెండు టీఎంసీల నుంచి 1 టిఎంసీకి తగ్గించాలని అత్యవసర ఆదేశాలు జారీ చేస్తారు. మన ప్రభుత్వం రెండు టీఎంసీల నుంచి ఒక్క టీఎంసీకి సామర్థ్యాన్ని తగ్గించుకుంది. తెలంగాణ తగ్గించుకుంటుంటే.. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం నీటి తరలింపు సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. రాయలసీమ సంగమేశ్వరం పేరుతో నీళ్లను ఏపీ తరలించుకుపోతే ఖమ్మం జిల్లాలోని నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ ఆయకట్టు తీవ్రంగా నష్టపోతుంది. లెఫ్ట్ కెనాల్ రొజుకు ఒక్క టీఎంసీ పారితే.. ఇక్కడ 11 టీఎంసీలు తరలిపోతాయి.

సంగమేశ్వరం నుంచి నీళ్లు తరలిపోతే శ్రీశైలం నిండేదెప్పుడు, శ్రీశైలమే నిండకపోతే.. ఆ ప్రాజెక్టు మీద ఆధారపడ్డ పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి, డిండి, భీమా, కోయిల్ సాగర్, ఎస్.ఎల్.బీ.సీ లు ఎప్పుడు నిండుతాయి.. ఎప్పుడు పారతాయి. వాటిమీద ఆధారపడ్డ లక్షలాది ఎకారలు.. ఎండిపోతాయి. ఇప్పటికే లెప్ట్ సాగర్ లెప్ట్ కెనాల్ కింద ఆయకట్టులో ఉన్న ఆరున్నల లక్షల ఎకరాలు కూడా ఎండిపోతాయి. మొత్తం కలిపితే.. దాదాపు 28 లక్షల 50 వేల ఎకరాలకు నష్టం జరుగుతుంది. దానికి తోడు హైదరాబాద్ కు మంచినీళ్లు వచ్చే అవకాశం కూడా రాదు. కేంద్ర జలశక్తి కమిటీ, అపెక్స్ కమిటీ మీటింగ్ చేస్తే వెళ్లకుండా తాత్సారం చేసారు. కేంద్ర జల శక్తి శాఖ ఏపీ పనులను మొదలు పెట్టక ముందే అపెక్స్ మీటింగ్ కు పిలిస్తే కావాలని టెండర్లు అయ్యేదాక కావాలని ఆలస్యం చేశారు. ఏపీ ప్రభుత్వం సంగమేశ్వరం టెండర్లు పూర్తయ్యే వరకూ కేసీఆర్ అపెక్స్ మీటింగ్ వద్దని కావాలని తెలంగాణ ప్రయోజనాలకు ఫణంగా పెట్టారు. అపెక్స్ కమిటీ మీటింగ్ పెట్టే నాటికి ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలవడం, కాంట్రాక్టర్లకు పనులు అప్పజెప్పడం, పనులు మొదలయిన తరువాత.. ఇప్పుడు నిద్ర లేచి.. టీఆర్ఎస్ మంత్రులు, కేసీఆర్ డ్రామాలు మొదలు పట్టారు. నీళ్ల కోసం తెచ్చున తెలంగాణలో కృష్ణా బేసిన్ లో ఒక్క ఏకరానికి నీళ్లు కేసీఆర్ సర్కార్ ఇవ్వలేదు. ఈ ఏడేళ్లలో కేసీఆర్ మొదలు పెట్టిన ప్రాజెక్టుల ద్వారా ఒక్క ఎకారానికి నీళ్లు పారలేదు.

ఈ ముఖ్యమంత్రిని నేను ఛాలెంజ్ చేస్తున్నా.. మీరు మొదలు పెట్టిన పాలమూరు-రంగారెడ్డి, డిండి కానీ ఇతరత్రా కొత్త ప్రాజెక్టుల ద్వారా క్రుష్ణానదిపైనుంచి కొత్తగా ఒక్కఎకరాకు నీళ్లు ఇవ్వలేదు. లక్షల కోట్లు ఖర్చుచేసినా కొత్త ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇవ్వలేదు. ఉమ్మడి రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టులు ద్వారానే నీళ్లు ప్రజలకు అందుతున్నాయి..కానీ ఈ మహానుభావుడితో చుక్క నీరు రాలేదు. రెండు పారాసెట్ మాల్ ట్యాబ్లెట్లు వేసుకుంటే కోవిడ్ తగ్గుతుంది అంటే సీఎం ట్రీట్మెంట్ తీసుకునే హాస్పిటల్ లో 28లక్షలు ఎలా వసూళ్లు చేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ భూత వైద్యం వల్లే ఇన్ని సమస్యలు- కేసీఆర్ నిర్లక్ష్యపు మాటలే వల్లే అధికారులు నిద్రపోయారు. హరీష్ రావు మాటలు మాటలకే పరిమితం... అమలులో మాత్రం ఉండవు. మరొక్క సారి రాష్ట్ర ప్రజలను మోసం.చేయడానికి కేసీఆర్ కుట్ర చేస్తున్నాడు. ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు హామీలు ఇస్తూ ప్రజల్ని మభ్యపెడుతున్నాడు ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి.. వాసాలమర్రి..లేదంటే నేను పుట్టిన ఊరు కు ఇచ్చి ..మిగతా గ్రామాల ముడ్డి ఎండబెడతాం అంటే ఎలా. వాటికి ఇచ్చిన్నట్లే మిగిలిన అన్ని గ్రామాలకు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు.

Next Story
Share it