ఎల్ రమణను మంచి పదవిలో తెచ్చుకుందాం
టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ కు చెందిన సీనియర్ నేత ఎల్ రమణను కెసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రమణతోపాటు మరికొంత మంది నాయకులు కూడా టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా కెసీఆర్ మాట్లాడుతూ చేనేత వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవవసరం ఉందన్నారు. రమణ తనకు మంచి మిత్రుడు అని.. మంచి రాజకీయ భవిష్యత్ ఉంటుందన్నారు. రమణ తాను నమ్ముకున్న సిద్ధాంతం కోసం పనిచేస్తారని వ్యాఖ్యానించారు. చేనేతలకు బాధల నుంచి విముక్తి కల్పించేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. తాను నమ్ముకున్న సిద్ధాంతం కోసం పనిచేసే వ్యక్తి రమణ అంటూ ప్రశంసించారు. చేనేత కార్మికులకు బీమా అందిస్తామని తెలిపారు. తాజాగా కేరళకు చెందిన ఓ కంపెనీ మూడు వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెడతానని వచ్చిందని..మరిన్ని కంపెనీలు కూడా వస్తాయన్నారు.
చేనేత సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా పనిచేస్తామన్నారు. ఒక్క చిన్న తప్పు కూడా జరగకుండా ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. నిన్న నలభై ఎకరాలు అమ్మితే రెండు వేల కోట్ల రూపాయలు వచ్చాయి..అది చేనేతల కోసం, దళితుల కోసం వాడతామన్నారు. ఇది ప్రజల సొమ్ము అని వ్యాఖ్యానించారు. తెలంగాణ దేశంలోనే ఇప్పుడు అందరి కంటే ఎక్కువ వేతనాలు ఇస్తుందని..ధనిక రాష్ట్రం అన్నారు. తాను కోరుకున్న తెలంగాణ సాధించి తీరతానని..అయితే దీనికి ప్రజల మద్దతు కావాలన్నారు. ఈ వయస్సులో తనకు ఏమీ కోరికలు ఏమీలేవన్నారు. ఈ సమయంలో రమణ మంచి నిర్ణయం తీసుకోవటం స్వాగతించదగ్గర పరిణామం అన్నారు.