Telugu Gateway
Politics

తుపాకీ విలువ టైమ్ వచ్చినప్పుడే తెలుస్తది

తుపాకీ విలువ టైమ్ వచ్చినప్పుడే తెలుస్తది
X

ఒకడు ఎగిరెగిరి ఏమైపోయాడో తెలుసు

అందరి చరిత్రలు మా దగ్గర ఉన్నాయి

మంత్రి కెటీఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ వి విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన ఆయన ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. 'సీఎంలను ఉరికించిన చరిత్ర టీఆర్ఎస్ ది.. మా మౌనాన్ని బలహీనతగా భావించొద్దు. గోడకు వేలాడ దీసే తుపాకీ మౌనం గా ఉంటుంది ..టైం వచ్చినపుడు తుపాకీ విలువ తెలుస్తుంది. విద్యార్థులు ఉస్మానియా ,కాకతీయ యూనివర్సిటీల్లో చదువుకుంటే బీజేపీ నేతలు వాట్సాప్ యూనివర్సిటీలో అబద్దాలు నేర్చుకుంటున్నారు.. వ్యాప్తి చేస్తున్నారు. కేసీఆర్ మౌనాన్ని ఎవ్వరూ తక్కువ అంచనా వేయొద్దు.. అవసరం వచ్చినప్పుడు బఫూన్ల భరతం పడతాం. తెలంగాణను గేళి చేసిన పరిస్థితుల్లో కేసీఆర్ ఒక్కడిగా ప్రయాణం ప్రారంభించారు. నిరాశ కల్పించినా కేసీఆర్ కుంగిపోకుండా తెలంగాణ సాధించారు. అలాంటి కేసీఆర్ గారిని గౌరవం లేకుండా కొందరు మాట్లాడుతున్నారు విద్యా ,ఉద్యోగ అవకాశాలు తెలంగాణ వచ్చిన తర్వాత భారీగా పెంచిన ఘనత కేసీఆర్ దే.

గురుకుల పాఠశాలలు ,కాలేజీలను తెలంగాణలో వంద శాతం పెంచుకున్నాం ఇవన్నీ తెలియకుండా కొందరు సన్నాసులు మాట్లాడుతున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ఇవన్నీ చేస్తే కేంద్రంలో ఉన్న బీజేపీ విద్యాపరంగా చేసింది గుండు సున్న. కొత్త ఐఐఎం, ఐఐటి, ట్రిపుల్ ఐటీ సంస్థలను దేశమంతా ప్రకటించిన బీజేపీ తెలంగాణకు ఇచ్చింది గుండుసున్నా. నవోదయ విద్యాలయాలు కూడా తెలంగాణకు దక్కలేదు. కొత్త మెడికల్ కాలేజీల్లో తెలంగాణకు దక్కింది మొండిచేయి. ఇన్ని మొండి చేతులు చూపిన బీజేపీ కి తెలంగాణలో ఎందుకు ఓటేయాలి ? విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ మూసేస్తుంటే ఇక బయ్యారంలో బీజేపీ ఉక్కు ఫ్యాక్టరీ కడుతుందా ? ఇలాంటి వాటి గురించి మాట్లాడకుండా బీజేపీ మాటకు ఇండియా పాకిస్థాన్ అంటుంది. ఏమైనా అంటే దేశం కోసం ధర్మం కోసం అంటారు . బీజేపీ నేతలకు తెలంగాణ దేశంలో భాగంగా ఉందని కనిపించడం లేదా ? పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ కి ఓటు ద్వారా యువత సమాధానం చెప్పాలి. లాయర్లు , జర్నలిస్టులకు సంక్షేమ నిధి కేటాయించాము.

మేం గణాంకాలతో అభివృద్ధి గురించి చెబితే బీజేపీ మాటలు మాత్రమే చెబుతోంది. మేము ఉద్యోగాల కల్పన గురించి మాట్లాడితే మోడీ పకోడీల గురించి మాట్లాడుతారు. పకోడీలు అమ్ముకుంటే కూడా అది కూడా తన ఘనతే అని మోడీ చెప్పుకుంటరు. టీఆర్ఎస్ మీటింగ్ లో బఠాణీలు అమ్ముకునే వారుంటారు.. అది మా ఘనతగా చెప్పుకోవాలా ? మోడీ మాటలు కోట్లల్లో ఉంటాయి.. చేతలు పకోడీల్లా ఉంటాయి (బాత్ కరోడోమే - కామ్ పకోడీమే). మోడీ 20 లక్షల కోట్ల ఆత్మ నిర్భర్ ప్యాకేజి అన్నారు.. ఒక్కరికైనా ఏమైనా వచ్చిందా ? దూషణలు చేస్తున్న వారికి మిత్తితో సహా బదులిస్తాం... ఒకడు ఎగిరెగిరి ఏమై పోయాడో తెలుసు. అందరీ చిట్టాలు మా దగ్గర ఉన్నాయి. రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్ఎస్ గెలవాలి. మనం చేసినవి చెప్పి ఓట్లడగాలి.' అని వ్యాఖ్యానించారు.

Next Story
Share it