హుజూరాబాద్ లో పోటీ వ్యక్తులు కాదు.. పార్టీల మధ్యే
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటీఆర్ హుజూరాబాద్ ఉప ఎన్నిక అంశంపై స్పందించారు. ఇక్కడ పోటీ పార్టీల మధ్యే తప్ప..వ్యక్తుల మధ్య కాదన్నారు. ఈటెల రాజేందర్ రాకముందే కమలాపూర్ లో పార్టీ బలంగా ఉందని వ్యాఖ్యానించారు. ఆయన బుధవారం తెలంగాణ భవన్ లో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీలో మంత్రి పదవులు అనుభవిస్తూ ఇతర పార్టీల నేతలకు ఈటెల టచ్ లోకి ఎలా వెళ్తారని ఆయన ప్రశ్నించారు. చివరి వరకు ఈటెల టీఆర్ఎస్ లొనే ఉండలాని వ్యక్తిగతంగా కోరుకున్నానన్నారు. అడ్డదిడ్డంగా మాట్లాడి ఆయనకు ఆయనే ఆత్మ వంచన చేసుకున్నారని ఆరోపించారు. ఈటెల రాజేందర్ కు టీఆర్ఎస్ లో జరిగిన అన్యాయం ఏంటో చెప్పాలన్నారు. మంత్రిగా ఉండి మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను బహిరంగంగా తప్పు పట్టారని, మంత్రి వర్గ సమావేశం లో ఈటెల ఎపుడైనా అసమ్మతి తెలియ జేశారా ? అని ప్రశ్నించారు.
ఈటెల రాజేందర్ తప్ప చేయకుండానే ఒప్పుకున్నారా? ఈటెల రాజేందర్ పై సానుభూతి ఎందుకు ఎట్లా వస్తదన్నారు. ఈటెల పై అనామకుడు ఉత్తరం రాస్తే సీఎం చర్యలు తీసుకోలేదని, ఆధారాలు ఉన్నాయనే చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఐదేళ్ల కిందట నుంచి కేసీఆర్ తో గ్యాప్ ఉంటే ఎందుకు మంత్రిగా కొనసాగారని ప్రశ్నించారు. ఈటెల రాజేందర్ సీఎం ను కలవను అని స్టేట్మెంట్ ఇచ్చిన తరువాత తాను ఎమ్ చేయగలనన్నారు. బండి సంజయ్ పాదయాత్ర పరమార్థం ఏంటో ఆయనకే తెలియాలని ఎద్దేవా చేశారు. నీటి వాటాల అంశంపై ఏపీ సుప్రీంకోర్టు ను ఆశ్రయించినా న్యాయం తెలంగాణ వైపే ఉందన్నారు.