కేసీఆర్ ది స్టేట్స్ మన్ పాలన, మోడీది సేల్స్ మెన్ పాలన
కేంద్రంలోని మోడీ సర్కారు, బిజెపి జాతీయ ప్రెసిడెంట్ నడ్డాపై తెలంగాణ మంత్రి కెటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. రైతుల నిరసన తో పీఎం మోడీ పంజాబ్ లో ఎన్నికల సభ ను రద్దు చేసుకున్నారని, ఇంతటి దౌర్భాగ్యం ఏ పీఎం కు రాలేదని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కెసీఆర్ ది స్టేట్స్ మన్ పాలన అయితే, ప్రధాని మోడీది సేల్స్ మెన్ పాలన అన్నారు. కెటీఆర్ బుధవారం సాయంత్రం మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, శ్రీనివాసగౌడ్ తదితరులతో కలసి మీడియాతో మాట్లాడారు. బండి సంజయ్ కు, జె పీ నడ్డాకు తేడా ఏమీలేదని ఆయన నిన్న చేసిన వ్యాఖ్యలతో తేలిపోయిందన్నారు. బిజెపి మీడియాను మోడియాగా మార్చిందని ఎద్దేవా చేశారు. కెటీఆర్ వ్యాఖ్యలు ఆయన మాట్లల్లోనే...' మోడీ ఈ ఏడేండ్లలో చేసిన మంచి పని ఒక్కటీ లేదు. బీజేపీ కి సీబీఐ, ఈడీ, ఎన్ ఐఏ భాగస్వామ్య పక్షాలుగా మారాయి. యూపీ లో బీజేపీ అభివృద్ధి పేరిట ఓట్లు అడగడం లేదు. విద్వేషాలు రెచ్చ గొట్టడం తోనే ఓట్లు పొందాలని బీజేపీ అక్కడ విష ప్రచారం చేస్తోంది.
మోడీ ది సిగ్గు మాలిన ప్రభుత్వం. 2022 కల్లా ఇండియా లో ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తా అని మోడీ హామీ ఇచ్చారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అని కూడా హామీ ఇచ్చారు. మోడీ రైతు విరోధి గా మారారు. నడ్డా అబద్ధాల అడ్డా కేర్ ఆఫ్ ఎర్రగడ్డ. అర పైసా ఉపయోగ పడే పని మోడీ దేశానికి ఏమైనా చేశారా. ఇంత దిక్కుమాలిన, దౌర్భాగ్యపు కేంద్ర ప్రభుత్వం ఉందా. కాళేశ్వరం కేసీఆర్ కు ఎటిఎం అంటావా?. కేసీఆర్ నిజంగా ఎటీఎమే. ఏటీఎం అంటే అన్నదాతకు తోడుండే మెషిన్. దిక్కుమాలిన బీజేపీ కి మా ప్రభుత్వ పథకాలే కాపీ కొట్టడానికి పనికొస్తున్నాయి. కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వకుండా నడ్డా సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. కల్లాల లో వడ్ల నుంచి కంటోన్మెంట్ రోడ్ల దాకా అంతా బీజేపీ కిరికిరే.
ప్రజాస్వామ్యం గురించి బిజెపి మాట్లాడటమా?. కేంద్ర మంత్రి బలుపు తో రైతులను కారు తో తొక్కించి చంపినా చర్యలు తీసుకోని బీజేపీ మా గురించి మాట్లాడుతామా. కుటుంబ పాలన గురించి బీజేపీ మాట్లాడమా. నడ్డా అత్త జయశ్రీ బెనర్జీ ఎంపీ గా మంత్రి గా పని చేయలేదా. బీజేపీ లో ఎంత మంది నాయకులు వారి వారసులు రాజకీయాల్లో లేరూ?. మేము ఉద్యమాల్లో పాల్గొని ప్రజలు ఎన్నుకుంటే గెలిచాం. .బీజేపీ పాలిత కర్ణాటక లో అవినీతి అత్యంత ఎక్కువ అని మీడియా సంస్థలు మేధావులు ఘోషిస్తున్నారు. నడ్డా పెద్ద పోటు గాడా?. బండి సంజయ్ తన గుండు తానే పగుల గొట్టుకుంటున్నాడు.బండి పోతే బండి వస్తుంది.. గుండు పోతే గుండు వస్తుందా. తెలంగాణ లో ఏం కొంపలు మునిగాయని నడ్డా హైద్రాబాద్ వచ్చాడు?. బీజేపీ ఎర్రగడ్డ మాటలు, ఎర్రగడ్డ చేతలు ప్రజలు అన్నీ చూస్తున్నారు.' అని వ్యాఖ్యానించారు.