Telugu Gateway
Politics

కాశ్మీర్ పై ట్రంప్ కొత్త ట్వీట్ ..ఇరకాటంలో ప్రధాని !

కాశ్మీర్  పై ట్రంప్ కొత్త ట్వీట్ ..ఇరకాటంలో  ప్రధాని !
X

యుద్ధం ఆగటం మంచిదే. ఇందులో ఎవరికీ రెండో అభిప్రాయం లేదు. కానీ పాకిస్థాన్ విషయంలో ఈ సారి గట్టి జవాబు ఇస్తారు అని భావించిన దేశ ప్రజలకు ప్రధాని మోడీ మిడిల్ డ్రాప్ నచ్చలేదు. ఎక్కువ మంది ఇప్పుడు ఇదే అభిప్రాయంతో ఉన్నారు. కరుడుగట్టిన ఉగ్రవాదులను దాడులతో హతమార్చినా..ఆ తర్వాత కూడా పాకిస్థాన్ తన బుద్ది ఏ మాత్రం మార్చుకోకుండా భారత్ లోని సామాన్య పౌరులు...సైనికులు, ప్రార్ధనా మందిరాలే టార్గెట్ గా దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో కూడా కొంత మంది అమరులు అయ్యారు కూడా . మరో వైపు పాకిస్థాన్ ఇప్పుడు ఆర్థికంగా...అంతర్గత సమస్యలతో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటోంది. పాక్ కు గట్టి బుద్ది చెప్పటానికి ఇదే సరైన సమయం అని ఎక్కువ మంది భావించారు. భారత ప్రభుత్వ నిర్ణయాలు చూసి ఈ సారి పాకిస్థాన్ కు గట్టిగా ..మరో సారి భారత్ వైపు చూడాలంటేనే భయపడేలా సమాధానం ఉంటుంది అని ఆశించారు. కానీ వారి ఆశలు ఏ మాత్రం నిజం కాలేదు.

శనివారం సాయంత్రం యుద్ధం కీలక దశకు చేరుకోనుంది అని అంతా భావించిన సమయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణకు భారత్-పాకిస్థాన్ లు అంగీకరించాయి అని ట్వీట్ చేసి అందరిని షాక్ చేశారు. ట్రంప్ ట్వీట్ వచ్చిన తర్వాత కొద్దిసేపటికే భారత్, పాకిస్థాన్ లు కూడా ఈ విషయంపై అధికారిక ప్రకటన చేశాయి. భారత్-పాకిస్థాన్ ల మధ్య యుద్ధ దీర్ఘకాలం సాగాలని దేశంలో ఎవరు కోరుకోలేదు. కాకపోతే పాకిస్థాన్ కు గట్టిగా బుద్ధిచెప్పి కాల్పుల విరమణ ప్రకటన చేసి ఉంటే బాగుండేది అన్నది ఎక్కువ మంది అభిప్రాయంగా ఉంది. ఈ విషయంలో అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ చెప్పినదానికి ఒకే చెప్పారు అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరో వైపు ట్రంప్ అక్కడితో ఆగకుండా కాశ్మీర్ సమస్య పరిష్కారానికి భారత్, పాకిస్థాన్ లతో కలిసి పనిచేయటానికి సిద్ధం ఉన్నట్లు మరో ట్వీట్ చేశారు. అసలు కాశ్మీర్ విషయంలో ఇతరుల జోక్యం అవసరం లేదు అని భారత్ ఎప్పటి నుంచో చెపుతున్నా కూడా ట్రంప్ ఇప్పుడు కొత్తగా ఈ ట్వీట్ చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇవి అన్ని కూడా రాజకీయంగా ప్రధాని నరేంద్ర మోడీని ఇరకాటంలోకి నెట్టే అవకాశం ఉంది అనే చర్చ సాగుతోంది.

మరో వైపు ఇప్పుడు ప్రధాని మోడీ కంటే గతంలో ప్రధాని గా ఉన్న ఇందిరా గాంధీ అమెరికా విషయంలో చాలా గట్టిగా వ్యవహరించారు అనే విషయాన్ని ప్రస్తావిస్తూ సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇదే ఇప్పుడు బీజేపీ నాయకులకు కూడా ఇబ్బందికర పరిణామంగా మారింది. ఇదే అదనుగా కాంగ్రెస్ పార్టీ సత్వరమే ప్రధాని మోడీ అద్యక్షతన అఖిలపక్ష సమేవేశం జరగాలి అని...మొత్తం వ్యవహారంపై పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో చర్చ జరపాలని కోరుతూ కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ట్వీట్ చేశారు. కాల్పుల విరమణ ఒప్పందంపై తొలుత డోనాల్డ్ ట్రంప్ ప్రకటన చేయటం, ఆ తర్వాత భారత్, పాకిస్థాన్ లు ప్రకటన చేయటాన్ని కూడా అయన ప్రస్తావించారు.

Next Story
Share it