Telugu Gateway
Politics

పార్టీ మారిందని భార్యకు విడాకులు

పార్టీ మారిందని భార్యకు విడాకులు
X

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఇదో వింత. పార్టీ మారిందని తన భార్యకు విడాకులు ఇస్తున్నట్లు బిజెపి ఎంపీ ప్రకటించారు. ఈ వ్యవహారం రాజకీయంగా అత్యంత ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీఎంసీ, బిజెపి ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఒకరిపై ఒకరు ఆధిపత్యం సాధించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన భారతీయ జనతా పార్టీ పార్లమెంట్‌ సభ్యులు సౌమిత్రా ఖాన్‌ భార్య సుజాతా మండల్‌ ఖాన్‌ సోమవారం నాడు తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరారు. బెంగాళ్‌లోని బిష్ణూపూర్‌ నియోజకవర్గం నుంచి పార్లమెంట్‌కు ఎన్నికైన సౌమిత్రా ఖాన్‌ భారతీయ జనతా యువ మోర్చా అధ్యక్షుడిగా కూడా ఉన్నారు.

కోల్‌కతాలో టీఎంసీ నాయకులు సౌగతా రాయ్, పార్టీ అధికార ప్రతినిధి కునాల్‌ ఘోష్‌ సమక్షంలో సుజాతా ఖాన్‌ తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 2019లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో భర్తను గెలిపించుకునేందుకు ఎంతో కష్టపడినప్పటికీ బీజేపీలో తనకు తగిన గుర్తింపు రాకపోవడంతో తాను పార్టీ మారాల్సి వచ్చిందని సుజాతా మండల్‌ ఖాన్‌ ఆరోపించారు. ఎప్పటి నుంచో పార్టీకి విధేయంగా పని చేస్తున్న తమ లాంటి వారికి కాకుండా ఇటీవల పార్టీలో చేరిన అవినీతి పరులకు గుర్తింపు ఇస్తుండడంతో విధిలేని పరిస్థితుల్లో తాను పార్టీ మారానని ఆమె వివరించారు.

ఇప్పటికీ బీజేపీలో కొనసాగుతోన్న ఆమె భర్త గురించి ప్రశ్నించగా, అది ఆయన ఇష్టమని, ఏదో రోజున వాస్తవాలను గుర్తించి తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరినా చేరిపోవచ్చని ఆమె చెప్పారు. ఇదే విషయమై సౌమిత్రా ఖాన్‌ను ప్రశ్నించగా, సుజాతా ఖాన్‌ పార్టీ మారినందున తమ పదేళ్ల వివాహిక బంధాన్ని తెంపేసుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, త్వరలోనే విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంటానని చెప్పారు. ఇక ముందు తన భార్య తన సర్‌ నేమ్‌ను వాడుకోరాదని ఆయన చెప్పారు. పార్టీ మార్పు అనేది పూర్తిగా తన సొంత నిర్ణయం అని సుజాత మండల్ ఖాన్ వ్యాఖ్యానించారు. అయితే సౌమిత్రా ఖాన్ మాత్రం ఆమె నిర్ణయం పెద్ద తప్పు అని ప్రకటించారు.

Next Story
Share it