Telugu Gateway
Politics

హైదరాబాద్ కు సముద్రం తెచ్చిన ఘనత కెసీఆర్ దే

హైదరాబాద్ కు సముద్రం తెచ్చిన ఘనత కెసీఆర్ దే
X

కేంద్ర మంత్రి హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. పేదలకు అందాల్సిన పది వేల రూపాయల వరద సాయాన్ని మంత్రి కెటీఆర్ అనుచరులు తన్నుకుపోతున్నారని ఆరోపించారు. పేదలకు ఇవ్వాల్సిన డబ్బును నేతలు నొక్కేయటం దారుణమన్నారు. పేదలకు ఎన్ని డబుల్ బెడ్ రూ మ్ ఇళ్ళు ఇచ్చారో చెప్పాలని సవాల్ చేశారు. హైదరాబాద్‌కు సముద్రాన్ని తెచ్చిన ఘనత కేసీఆర్‌దే అని ఎద్దేవా చేశారు. నగరంలో గుంతలు లేని రోడ్లు కేటీఆర్ చూపించగలడా?. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు టీఆర్ఎస్‌కు లేదన్నారు. సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం కారణంగానే వందల కాలనీలు నీట మునిగాయి. ప్రజలకు అబద్దాలు, అవాస్తవాలు చెప్పటం కేటీఆర్‌కు అలవాటుగా మారిందని విమర్శించారు.

తెలంగాణపై ప్రధాని నరేంద్రమోడీ వివక్ష చూపిస్తున్నారని చేసిన ఆరోపణలపై కిషన్ రెడ్డి స్పందించారు. కిషన్ రెడ్డి సహాయ మంత్రా, నిస్సహాయ మంత్రా అని కెటీఆర్ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. వరద నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమగ్ర నివేదికలు పంపలేదని కిషన్ రెడ్డి తెలిపారు. తాడ్‌బండ్ సిక్‌ విలేజ్ హాకీ గ్రౌండ్స్‌ లో ఆదివారం బీజేపీ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. వరదలను నియంత్రించటంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపించారు. విపత్తు తక్షణ సాయంగా తెలంగాణకు కేంద్రం రూ.224 కోట్లను పంపింది. ఎన్నికలపై ఉన్న ద్యాస ప్రభుత్వానికి ప్రజల బాగుపై లేదు. వరద నష్టంపై సమగ్ర నివేదికలు పంపాలన్న బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. బీజేపీని బద్నాం చేయాలన్న ఉద్దేశంతోనే కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం నివేదికలు పంపలేదు. తెలంగాణ రోడ్ల కోసం కేంద్రం రూ. 202 కోట్లు ఇచ్చింది. వరద బాధితులను సీఎం పరామర్శించకపోవటం బాధ్యతారాహిత్యం.

హైదరాబాద్ అభివృద్ధికి కేటాయించిన రూ.67 వేల కోట్లు ఎటు పోయాయో కేటీఆర్ చెప్పాలి. రాబోయే రోజుల్లో తండ్రీ కొడుకుల ప్రభుత్వాన్ని తరిమికొడతామని కిషన్‌ రెడ్డి హెచ్చరించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ క్యాబినెట్‌లో తాగుబోతులు, తిగురుబోతులున్నారు. దుబ్బాక ఉపఎన్నికపై టీఆర్ఎస్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. బీజేపీ ఎక్కడుందో కవిత, బోయినపల్లి వినోద్‌ను అడిగితే తెలుస్తోంది. 2023లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతోంది. హిందువుల దేవుళ్ళను అవమాన పర్చిన ఎంఐఎంతో కేసీఆర్ పొత్తు పెట్టుకున్నాడు. 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కేసీఆర్ మోసం చేశాడు. కేసీఆర్‌పై మలిదశ ఉద్యమం చేయాల్సిన సమయం వచ్చింది' అని బండి సంజయ్‌ అన్నారు.

Next Story
Share it