గుజరాత్ కు కొత్త సీఎం వచ్చేశారు
గుజరాత్ లో కీలక పరిణామాలు. శనివారం సీఎం విజయ్ రూపానీ రాజీనామా. ఆదివారం కొత్త సీఎంగా భూపేంద్రబాయ్ పటేల్ ఎన్నిక. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. విజయ్ రూపానీ సారధ్యంలో ఎన్నికలకు వెళితే గెలుపు కష్టం అని నిర్ధారణకు వచ్చిన తర్వాతే బిజెపి అధిష్టానం ఈ మార్పులు చేపట్టినట్లు సమాచారం. . విజయ్ రూపానీ రాజీనామా అనంతరం నేడు గాంధీనగర్లో సమావేశమైన బీజేపీ శాసనసభాపక్షం ఘాట్ లోడియా ఎమ్మెల్యే భూపేంద్ర పటేల్ను తమ నాయకుడిగా ఎన్నుకుంది.
మాజీ సీఎం విజయ్ రూపానీ భూపేంద్ర పేరును ప్రతిపాదించగా నితిన్ పటేల్ సమర్థించారు. మిగతా ఎమ్మెల్యేలంతా మద్దతు పలికారు. 2022లో గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో విజయ్ రూపాని కన్నా సమర్థుడు కావాలని బీజేపీ అధిష్టానం కొత్త సీఎంను తీసుకొచ్చింది. ఏకగ్రీవంగా ఈ ఎన్నిక జరిగిందని బిజెపి ప్రకటించింది. మరి ఈ మార్పు గుజరాత్ లో బిజెపి అధికారాన్ని నిలబెడుతుందో లేదో వేచిచూడాల్సిందే.