ప్రభుత్వాన్ని అస్ధిరపర్చాలనే కుట్ర

పీఆర్సీకి సంబంధించి ఉద్యోగుల ఆందోళన అంశంపై వైసీపీ సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి గురువారం నాడు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వాన్ని అస్థిర పర్చాలని కొందరు కుట్రలు చేస్తున్నారన్నారని, ఉద్యోగులు వారి ట్రాప్ లో పడొద్దని అన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని కూడా ఉద్యోగులు అర్ధం చేసుకోవాలని సూచించారు. హెచ్ఆర్ఏపై అన్ని ఉద్యోగ సంఘాలతో మాట్లాడతామని తెలిపారు. ఉద్యోగులు మొండి వైఖరిని విడనాడాలని సూచించారు. ప్రభుత్వం ఖచ్చితంగా ఉద్యోగులతో చర్చలు జరుపుతుందని తెలిపారు. కొందరి మాటలు విని ప్రభుత్వంపై బురద చల్లవద్దని హితవు పలికారు.
కరోనా సమయంలోనూ ప్రభుత్వంపై ఎంతో భారం పడిందన్నారు.ఉద్యోగులు ఆవేశాలకు లోను కావద్దన్నారు. ఏ రాష్ట్రంలోనైనా 27 శాతం ఐఆర్ ఇచ్చారా అని ప్రశ్నించారు. తమది అందరికీ మంచి చేయాలనే ఆలోచించే ప్రభుత్వం అని తెలిపారు. పదివేల కోట్ల భారం పడుతున్నా సీఎం వైఎస్ జగన్ వెనుకాడలేదని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. పీఆర్సీ. కొత్త జీవోల అంశంపై ఉద్యోగులు గురువారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు. అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల ముట్టడికి ఉద్యోగులు ప్రయత్నించటం..వారిని పోలీసులు అడ్డుకోవటంతో పలు చోట్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది.