టీఆర్ఎస్ కార్పొరేటర్ల సంఖ్య 56కు
నెరేడ్ మెట్ సస్పెన్స్ వీడింది. ఈ డివిజన్ కూడా అధికార టీఆర్ఎస్ పరమైంది. దీంతో జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ కార్పొరేటర్ల సంఖ్య 56కి పెరిగింది. స్వస్తిక్ కాకుండా ఇతర గుర్తులతో ఉన్న ఓట్ల కౌంటింగ్ ను ఆపాలంటూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలతో ఈ ఫలితాన్ని నిలిపివేశారు. తాజాగా జరిపిన కౌంటింగ్ లో 782 ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి మీనా ఉపేందర్ రెడ్డి గెలిచారు. ఇతర గుర్తులున్న 544 ఓట్లలో టీఆర్ఎస్కు 278 ఓట్లు వచ్చాయి.తమ పార్టీ అభ్యర్ధి విజయంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోగా, బీజేపీ కార్యకర్తలు నిరుత్సాహానికి గురయ్యారు. నేరెడ్మెట్ కౌంటింగ్ కేంద్రం వద్ద బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తిరస్కరణకు గురైన 1300 ఓట్లు లెక్కించాలని బీజేపీ అభ్యర్థి ప్రసన్ననాయుడు డిమాండ్ చేశారు. టీఆర్ఎస్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో అవకతవకలు జరిగాయని, అధికార పార్టీకి ఎన్నికల అధికారులు అనుకూలంగా వ్యవహరించి 600కుపైగా చెల్లని ఓట్లను టీఆర్ఎస్ ఖాతాలో వేశారని ప్రసన్ననాయుడు ఇంతకుముందు ఆరోపించారు.