Telugu Gateway
Politics

విచారణ నివేదిక తర్వాత అన్నీ మాట్లాడతా

విచారణ నివేదిక తర్వాత అన్నీ మాట్లాడతా
X

భూ కబ్జా ఆరోపణలపై ముఖ్యమంత్రి తనను పిలిచి వివరణ కోరితే బాగుండేదని మంత్రి ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. మీడియా కూడా తననుంచి ఎలాంటి సమాచారం అడగకుండానే బురదజల్లే ప్రయత్నం చేశాయన్నారు. అయినా కూడా అన్ని విషయాలు విచారణ కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే మాట్లాడతానని వ్యాఖ్యానించారు. ఈటెల శనివారం నాడు వివిధ మీడియా ఛానళ్ల ప్రతినిధులతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'బాజాప్తా చెప్పిన మేము గులాబీ పార్టీ ఓనర్లమని. నిందలు వేసే బదులు పిలిచి అడిగితే చెప్పేవాడిని కదా. మా మీడియా లో ఇలాంటి బురదజల్లే వార్తలు రావడం బాధిస్తోంది. సభ్య సమాజం అసహ్యించుకుంటోంది. నన్ను పార్టీ నుంచి వెల్లిపో అంటే వెల్లిపోయేవాన్ని, ఎల్లగొట్టిన పోయేవాన్ని.కానీ వ్యక్తిత్వాన్ని దెబ్బదీసి, డిమోరలైజ్ చేసి దోషిగా నిలబెడుతున్నారు.

అకారణంగా అత్యంత దుర్మార్గం నా కోళ్ళ ఫారాలు అసైన్ మెంట్ ల్యాండ్ లో కట్టారని చిల్లర టీవీల్లో వార్తలు రావడం జుగుప్సాకరం, నీతి మాలిన చర్య. బ్లాక్ మెయిల్ వార్తలతో భయపడుతాను అనుకోవటం వారి మూర్ఖత్వం. కబ్జా ఆరోపణలపై అఖిల పక్షాలు, ప్రజా సంఘాల క్షేత్ర స్థాయిలో పర్యటించి విచారణ చేపట్టవచ్చు. మీ దభాయింపులు నా దైర్యాన్ని చంపలేవు. తప్పు చేస్తే దోషిగా నిలబడుతా. కాంట్రక్టులు, దొంగ పనులు ఏనాడు చేయలేదు. శ్రమను కష్టాన్ని నమ్ముకుని ముందుకు సాగుతున్నా. ముక్కుసూటిగా మాట్టడే మనిషిని. ఇంతకు మించి ఎదగాలని ఎప్పుడు ఆశ పడలేదు. నాకు కుట్రలు, కుతంత్రాలు తెలియదు. తొందరపడం..మలినాలను కడిగేసుకుంటా' అని వ్యాఖ్యానించారు.

Next Story
Share it