సంజయ్ రౌత్ కు ఈడీ నోటీసులు

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం పీక్ లో ఉన్న తరుణంలో ఈడీ మరోసారి ఎంటరైంది. శివసేనలో అత్యంత కీలకనేత, ఎంపీ సంజయ్ రౌత్ కు ఈడీ తాజాగా సమన్లు జారీ చేసింది. మంగళవారం నాడు తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. అయితే ముందే నిర్ణయించుకున్న కార్యక్రమాల వల్ల తాను హాజరు కావటం లేదని సంజయ్ రౌత్ వెల్లడించారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికి 50 కోట్ల రూపాయలు ఇచ్చి కొనుగోలు చేశారని శివసేన పత్రిక సామ్నా వేదికగా సంచలన ఆరోపణలు చేసిన వెంటనే ఈ నోటీసులు జారీ చేయటం విశేషం. ఈడీ నోటీసులపై సంజయ్ రౌత్ మండిపడ్డారు. దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలని సవాల్ చేశారు. ఓ పెద్ద కుట్ర జరుగుతోందని, భీకర యుద్ధానికి శివసైనికులు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండేపై ఆయన తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలను ఉద్దేశించి, వారు జీవచ్ఛవాలని, వారి ఆత్మలు మరణించాయని అన్నారు.
ఈడీ నోటీసుల తనను నిలువరించేందుకు జరుగుతున్న కుట్ర అని ఆరోపించారు. సోమవారం చేసిన ఓ ట్వీట్లో, ''ఈడీ నన్ను పిలిచిందని ఇప్పుడే నాకు తెలిసింది. మంచిది! మహారాష్ట్రలో మహా రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయి. బాలా సాహెబ్ తాలూకు శివసైనికులమైన మేము గొప్ప యుద్ధంలో పోరాడుతున్నాం. ఇదంతా నన్ను ఆపేందుకు జరుగుతున్న కుట్ర. మీరు నా తలను తెగనరికినా, నేను గువాహటి మార్గంలోకి రాను. నన్ను అరెస్ట్ చేయండి. జైహింద్!'' అని పేర్కొన్నారు. ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన వర్గం బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఈడీ, సీబీఐ, తదితర వ్యవస్థల ద్వారా ఒత్తిడి తేవడం వల్లే ఏక్నాథ్ షిండే నేతృత్వంలో శివసేనలో తిరుగుబాటు వచ్చిందని ఆరోపిస్తోంది. షిండే సారధ్యంలోని శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు ప్రస్తుతం గువాహటిలో బస చేస్తున్న సంగతి తెలిసిందే. సంజయ్ రౌత్ రూ.1,034 కోట్ల విలువైన పాట్రా చావల్ భూ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన ఆస్తులను ఈడీ ఏప్రిల్లో జప్తు చేసింది. ఇటువంటి చర్యలకు తాను భయపడేది లేదని ఆయన హెచ్చరించారు.