Telugu Gateway
Politics

అమిత్ షాతో ఈటెల రాజేంద‌ర్ భేటీ

అమిత్ షాతో ఈటెల రాజేంద‌ర్ భేటీ
X

బిజెపిలో చేరిన త‌ర్వాత తొలిసారి మాజీ మంత్రి ఈటెల రాజేంద‌ర్ బుధ‌వారం నాడు ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో స‌మావేశం అయ్యారు. ఈ భేటీ కోస‌మే బిజెపి తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్ బండి సంజ‌య్, ఈటెల ఢిల్లీ బ‌య‌లుదేరి వెళ్లారు. ఈ స‌మావేశంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక‌తో పాటు తెలంగాణ‌లో రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై చ‌ర్చించారు. అమిత్ షాతో భేటీ అనంత‌రం ఈటెల‌ రాజేందర్‌ మీడియాతో మాట్లాడారు. ''అమిత్ షాను కలిసి రాష్ట్ర పరిస్థితులు వివరించాం. తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరాలని ఆయన అన్నారు. ఇందుకోసం ఎన్ని సార్లైనా తెలంగాణ వ‌స్తాన‌న్నారు. ఎంత డబ్బు ఖర్చు చేసినా గెలిచేది బీజేపీ మాత్రమే'' అని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ. ''ఈటెల రాజేందర్ బీజేపీలో చేరిన రోజే అమిత్ షాను కలవాలని అనుకున్నాం.

అప్పుడు కుదరలేదు కాబట్టి సమయం తీసుకుని ఈ రోజు వచ్చి కలిశాము. ఈటెల రాజేందర్ ఎన్నికల్లో గెలుస్తారనే సర్వే రిపోర్ట్స్ వచ్చాయి. బీజేపీ బహిరంగ సభకు అమిత్ షా తెలంగాణకు వస్తామని అన్నారు. అలాగే పాదయాత్రకు కూడా ఆయన్ను ఆహ్వానించాం. ఆగస్టు 9న పాదయాత్ర మొదలవుతుంది'' అని బండి సంజయ్‌ తెలిపారు. ''ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ సిద్ధమే. టీఆర్ఎస్ పార్టీ భయపడుతోంది. వారికి అభ్యర్థి కూడా దొరకడం లేదు. డబ్బులు ఎంత పంచినా.. అది ప్రజల సొమ్మే కాబట్టి తీసుకుందాం. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ను గెలిపిద్దాంఅవినీతి, అక్రమాల, అరాచక పాలనను అంతం చేయడం కోసం పాదయాత్ర చేపడుతున్నాం'' అని బండి సంజయ్ వెల్ల‌డించారు.

Next Story
Share it