ఈటెల జమున సంచలన వ్యాఖ్యలు
లంగాణలో ప్రస్తుతం ఉత్కంఠ రేపుతున్న నియోజకవర్గం హుజూరాబాద్. అక్కడ గెలుపు ఎవరి పరం కాబోతుంది? ఈటెల రాజేందర్ తన సత్తా చాటనున్నారా?. అధికార టీఆర్ఎస్ చెబుతున్నట్లు హుజూరాబాద్ బలం టీఆర్ఎస్ దా..లేక ఈటెల రాజేందర్ దా అన్న విషయం తేలనుందా?. ఈ ఏడేళ్ల కాలంలో ఓ మంత్రి పార్టీకి రాజీనామా చేసి ఉప ఎన్నిక ద్వారా సవాల్ విసురుతుండటం ఇదే మొదటిసారి కావటంతో దీనికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. అదే సమయంలో అధికార టీఆర్ఎస్ లో ఏకస్వామ్యం, నిరుద్యోగ యువతకు సరైన అవకాశాలు కల్పించకపోవటం వంటి విమర్శలు చాలానే ఉన్నాయి. అందుకే హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ తరుణంలో ఈటెల రాజేందర్ భార్య జమున సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఉప ఎన్నికల్లో ఈటెల రాజేందర్ పోటీ చేసినా, తాను పోటీ చేసినా ఒక్కటేనని ఆమె వెల్లడించారు. ఈటెల రాజేందర్ పోటీకి దూరంగా ఉంటారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. తెలంగాణ ఉద్యమంలో కూడా తన భర్త ఈటల రాజేందర్ను వెనకుండి నడిపించానని జమున వ్యాఖ్యానించారు. తమలో ఎవరు పోటీచేసినా గుర్తు అదే ఉంటుంది కదా అని వ్యాఖ్యానించారు. ప్రతి ఎన్నికల్లో ఈటెల ముందుండి ప్రచారం చేశానని చెప్పారు. తమ ఇద్దరిలో ఎవరికి అవకాశం వస్తే వాళ్లు పోటీ చేస్తారని ఆమె స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన సతీమణి చేసిన తాజా వ్యాఖ్యలతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.