రేవంత్ కోసం..సీతక్క మొక్కు
సీతక్క రేవంత్ రెడ్డితో పాటే కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. ఈ మధ్యలో ఆమెను సీఎల్పీ సమావేశానికి పిలవకుండా కూడా అవమానించారు. దీనికి కారణం ఆమె రేవంత్ రెడ్డి గ్రూప్ కావటమే. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డే పీసీసీ ప్రెసిడెంట్ అయ్యారు. అసలు విషయం ఏమిటంటే తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఎంపీ రేవంత్ రెడ్డి ఎన్నిక కావడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క మొక్కులు చెల్లించుకున్నారు.
రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి రావాలని ఆమె మేడారం అమ్మవార్లకు మొక్కుకున్నారు. తాజాగా రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి దక్కటంతో ఎమ్మెల్యే సీతక్క మొక్కులు చెల్లించారు. ఊరేగింపుగా వెళ్లిన సీతక్క అమ్మవార్లకు ప్రదక్షిణలు చేసి మొక్కు చెల్లించారు. తన సోదరుడు రేవంత్ కు పదవి దక్కటం పట్ల సీతక్క సంతోషం వ్యక్తం చేశారు. రేవంత్ పీసీసీ పదవి ఇచ్చినందుకు సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు.