Telugu Gateway
Politics

సీఎం కెసీఆర్ మాంత్రికుడి అవతారం అందుకే

సీఎం కెసీఆర్ మాంత్రికుడి అవతారం అందుకే
X

హైదరాబాద్ లోని జీఎంఆర్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 150 కిలోమీటర్ల దూరంలో మరో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అంగీకరించరనే విషయం ముఖ్యమంత్రిగా ఉన్న కెసీఆర్ కు తెలియదా అని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. వరంగల్‌కు విమానాశ్రయం తీసుకొస్తామని నాలుగేళ్ళ క్రితం సీఎం కెసీఆర్ చెప్పిన మాటలను సిద్దిపేట ప్రజలు గుర్తుచేసుకోవాలన్నారు. 2033 వరకు హైదరాబాద్‌కు 150కిలోమీటర్ల లోపల అంతర్జాతీయ విమానాశ్రయం కట్టలేరని స్పష్టం చేశారు. రఘునందన్ రావు శుక్రవారం నాడు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. సిద్ధిపేట సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించారని విమర్శించారు. దీనిపై ఫిర్యాదు చేస్తానన్నారు. దుబ్బాక ప్రజలు తమ వివక్షను తిప్పికొట్టినా.. సీఎం తన తీరును మార్చుకోలేదన్నారు. సిద్ధిపేట, వరంగల్, ఖమ్మం, మున్సిపల్ ఎన్నికల కోసమే ముఖ్యమంత్రి మాటల మాంత్రికుడి అవతారం ఎత్తాడని ఎద్దేవా చేశారు. జిల్లా ఎమ్మెల్యేగా ఉన్న తనను వేదిక మీదకు పిలవకుండా ప్రోటోకాల్‌ను ఉల్లంఘించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ కళాశాల ప్రారంభోత్సవాన్ని సీఎం కల్వకుంట్ల పేరంటంగా మార్చివేశారన్నారు.

దుబ్బాకలో వంద పడకల ఆసుపత్రిని వెంటనే పూర్తి చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌కు మాత్రమే రింగ్ రోడ్టులు వేశారని.. దుబ్బాక ప్రజలకు అన్యాయం చేశారని ఆరోపించారు. సిద్ధిపేట వంద రూపాయలు ఇస్తే.. దుబ్బాకకు కూడా వంద రూపాయలు ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేశారు. కొడుకు కోసం ఐటీ పార్క్, అల్లుడి కోసం మెడికల్ కాలేజ్ .. మనవడు కోసం గజ్వేల్‌ను సీఎం అభివృద్ధి చేస్తున్నారని విమర్శించారు. ఎస్‌ఈసీ, పోలీస్ అధికారులతో కలసి ప్రభుత్వం కుట్రతో కార్పోరేషన్ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వబోతోందన్నారు. రంగనాయక సాగర్‌లో కన్వెషన్ సెంటర్లు దేవుడెరుగు.. మండలం కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లు కట్టాలని ప్రజలు కోరుతున్నారని ఎమ్మెల్యే రఘునందనరావు పేర్కొన్నారు.

Next Story
Share it