Telugu Gateway
Politics

రాష్ట్రానికి స‌చివాల‌యం లేకుండా చేసిన ఘ‌నత కెసీఆర్ దే

రాష్ట్రానికి స‌చివాల‌యం లేకుండా చేసిన ఘ‌నత కెసీఆర్ దే
X

అవినీతి, భూ కబ్జాలే కేసీఆర్ విజయాలు..మ‌ల్లు భ‌ట్టివిక్ర‌మార్క‌

తెలంగాణ సీఎం కెసీఆర్ ఏడేళ్ల పాల‌న‌పై సీఎల్పీ నేత మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ ఏడేళ్ళ‌లో కెసీఆర్ సాదించిన విజ‌యాలు ఏమైనా ఉన్నాయంటే అది అవినీతి, భూ క‌బ్జాలే అన్నారు. విద్యార్థులు మంచి చదువులు చదవాలన్న లక్ష్యంతో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఫీజ్ రీ ఎంబర్స్ మెంట్ ఫథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా అటకెక్కించిందని విమ‌ర్శించారు. పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించాలన్న సంకల్పంతో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన రాజీవ్ ఆరోగ్యశ్రీ అరకొరగానే నడుస్తోందని భట్టి అన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఏడాదికో డీఎస్సీ వేసి ఉద్యోగాలు ఇచ్చేది. కానీ ఏడేళ్లువుతున్నా డీఎస్సీ లేదు.. ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్, నిరుద్యోగ భ్రుతి లేదని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడేళ్లలో దాదాపు లక్ష మంది ఉద్యోగులు పదవీ విరమ‌ణ చేస్తే.. ఆ ఖాళీలను సైతం కేసీఆర్ ప్రభుత్వం భర్తీ చేయలేదని భట్టి విమ‌ర్శించారు. ఇక పీఆర్సీ కమిటీ చెప్పిన లక్ష 72 వేల ఉద్యోగాలను భర్తీ చేయలేదని మండిపడ్డారు. ప్రతి నియోజకవర్గంలో లక్ష అదనపు ఎకరాకలు నీళ్లు ఇస్తామని చెప్పిన కేసీఆర్.. ఒక్క ఎకరాకి నీళ్లు ఇవ్వలేదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆత్మ గౌరవంతో బతకవచ్చని ప్రజలంతా ఆశించారు.. చివరకు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న మర్యాదను కూడా పొందలేకపోతున్నారని బట్టి ఆవేదన వ్యక్తం చేశారు.

దళితులకు ఇస్తామని ఎన్నికల హామీగా చెప్పిన మూడెకరాల భూ పంపిణీ లేదు.. మైనారిటీ రిజర్వేషన్ గాలికి వదిలేశారు.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అనేది ఒక ఘరానా మోసమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వివరించారు. ఆయ‌న బుధ‌వారం నాడు మీడ‌యాతో మాట్లాడారు. రాష్ట్రానికి సచివాలయం లేకుండా చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. అధికారులకు జవాబుదారీతనం లేకుండా చేసి.. వారు ఎక్కడ కూర్చుంటారో తెలియని పరిస్థితిని తెచ్చిన ఘనత కూడా కేసీఆర్ కు దక్కుతుందని అన్నారు. ఏడేళ్ల పాలనలో రాష్ట్రాన్ని లక్షల కోట్ల రూపాయలకు కుదవపెట్టారని భట్టి తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ అప్పులు 2023-24 నాటికి 6 లక్షల కోట్ల రూపాయాలకు చేరుకుంటాయని భట్టి చెప్పారు. అవినీతికి పాల్పడితే సొంత కుటుంబ సభ్యులను సైతం వదిలిపెట్టనని చెప్పిన కేసీఆర్.. పాలన అంతా అవినీతి మయంగా మారిందన్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు భూ దందాల్లో మాత్రమే విజయం సాధించారని అన్నారు. ముత్తిరెడ్డి, మంచిరెడ్డి, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్ ఇలా చెప్పకుంటూ పోతే అధికార పార్టీ నాయకులు భూ కబ్జాలకు అంతే లేదని అన్నారు. అనర్హత చట్టాన్ని తుంగలో తొక్కి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ అపహాస్యం పాలు చేశారని భట్టి చెప్పారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకుని.. వారిని మంత్రుల చేసిప ఘనత కేసీఆర్ కు మాత్రమే దక్కుతుందని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇసుక మాఫిమా, మైనింగ్ మాఫియా ఉందన్నారు. ముఖ్యమంత్రి, అయన బందువులు అందరూ రాష్ట్ర వనరులను దోచుకుంటున్నారని మండిపడ్డారు. పట్టపగలే లాయ‌ర్ దంపతులను నడిరోడ్డుమీద హత్య చేస్తే.. ఏమీ చేయలేని దుస్థితిలో రాష్ట్ర లా అండ్ ఆర్డర్ ఉందని భట్టి చెప్పారు.

ఇచ్చిన హామీలను అమలు చేయని సర్కార్ ఇదేనని భట్టి చెప్పారు. హుస్సేన్ సాగర్ ను సుందర జలాశయంగా మారుస్తామని.. అందులో నీళ్లు కొబ్బరి నీళ్లను తలపించేలా చేస్తానని చెప్పిన మాటలు.. మామీలు ఏమయ్యాయో చెప్పాలని భట్టి డిమాండ్ చేశారు. తెలంగాణలో సీనియర్ ఐఏఎస్ అధికారులను పక్కన పెట్టి ఏపీ కేడర్ కు చెందిన వ్యక్తిని చీఫ్ సెక్రెటరీగా నియమించుకుని మొత్తం బ్యూరోక్రసీని నిస్తేజం చేశారని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరిగేషన్ శాఖలోనూ పారదర్శకత లేదన్నారు. టెండర్లు ఎవరికి కావాలంటే వారికి కట్టబెట్టుకోవడం.. ఎప్పుడుకావాలంటే అప్పుడు అంచనాలు పెంచుకోవడం.. రాష్ట్ర ధనాన్ని దోచేయడాన్ని మనం చూస్తున్నామని అన్నారు.పొరుగు రాష్ట్రం నీళ్లను దోచుకుంటుంటే కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రచార ఆర్భాటం తప్పితే రాష్ట్ర అభివ‌ద్ధి ప‌ట్ట‌డం లేద‌న్నారు. అవినీతిపై దర్యాప్తు సంస్థలు విచారణ జరపడం లేదని అన్నారు. టీఆర్ఎస్ కు కాంగ్రెస్ పార్టీనే ప్రత్యామ్నాయం అని భట్టి చెప్పారు. కేసులు, ఇతరత్రా సమస్యలపై రక్షణ పొందేందుకే కొందరు బీజేపీలోకి వెళుతున్నారని భట్టి చెప్పారు.

Next Story
Share it