ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయానికి భూమి పూజ
అధికార టీఆర్ఎస్ కొత్త చరిత్ర లిఖించబోతుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఏ ప్రాంతీయ పార్టీకి ఢిల్లీలో కార్యాలయం లేదు. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి గురువారం నాడు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ భవన నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలోని వసంత్ విహార్లో 1100 గజాల స్థలం కేటాయించింది.
ఇక్కడే భూమి పూజ నిర్వహించారు. వచ్చే ఏడాది దసరాలోగా భవన నిర్మాణాన్ని పూర్తి చేసి పలు జాతీయ, ప్రాంతీయ పార్టీల అధినేతలను ప్రారంభోత్సవానికి ఆహ్వానించాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశముంది.