Telugu Gateway
Politics

మోడీ మారారా..బాబు చూసే కోణం మారిందా!

మోడీ మారారా..బాబు చూసే కోణం మారిందా!
X

ఆంధ్ర ప్రదేశ్ కు అన్ని రకాలుగా అన్యాయం చేసిన ప్రధాని మోడీని పొగడటంలో తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు ఎక్కడ లేని ఉత్సాహం చూపిస్తున్నారు. తాజాగా అయన ఢిల్లీ పర్యటనలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయని చెప్పాలి. రాష్ట్ర విభజన తర్వాత తొలి సారి ఆంధ్ర ప్రదేశ్ కు చంద్రబాబు సీఎం అయిన సమయంలోనూ..ఇప్పుడు జగన్ సీఎం గా ఉన్న కాలంలోనూ ప్రధాని మోడీ ప్రత్యేక హోదా తో పాటు విభజన హామీలను అమలు చేయటంలో పూర్తిగా ఆంధ్ర ప్రదేశ్ కు అన్యాయం చేశారు. పోరాట యోధుడుగా చెప్పుకునే జగన్ కూడా ఈ విషయంలో చూస్తూ ఉండటం...అడుగుతూ ఉండటం తప్ప ఏమీ చేయలేం అన్నట్లు వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు 2019 అసెంబ్లీ ఎన్నికల ముందు మాత్రం ‘మోడీ ద్రోహం చేశారు. మోడీ ధర్మాన్ని ఫాలో కాలేదు. మోడీ పాలనలో అంతా కుప్పకూలి పోయింది. ప్రజలు మోడీ ని తిరస్కరిస్తారు. ’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇవే కాదు...మోడీ పై వ్యక్తిగత దూషణాలకు కూడా దిగారు. ఇప్పుడు మాత్రం ప్లేట్ ఫిరాయించి తాను ప్రత్యేక హోదా విషయంలో తప్ప దేంట్లోనూ మోడీ తో విభేదించలేదు అంటూ కొత్త రాగం అందుకున్నారు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న వాళ్లే మోడీని విమర్శించటం లేదు అంటూ చంద్రబాబు ఢిల్లీ లో వ్యాఖ్యానించారు. అంతే కాదు మోడీ భారత్ కు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెస్తున్నారు అంటూ ప్రశంసించారు. మరి 2019 లో విమర్శలు చేసే నాటికీ చంద్రబాబు కు రాజకీయ అనుభవం లేదా?. ఇండియా కూటమికి నాయకుడు లేకపోవటం మోడీకి కలిసి వచ్చే అంశం అంటూ కాంగ్రెస్ తో పాటు ఇతర ప్రతిపక్షాల కూటమి పై కూడా చంద్రబాబు వ్యాఖ్యానించటం విశేషం.

ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో మోడీ ప్రాపకం కోసమే ఇప్పుడు కొత్త రాగం అందుకున్నట్లు కనిపిస్తోంది అనే చర్చ సాగుతోంది. ఇప్పటికే రెండు సార్లు కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కారుపై వివిధ వర్గాల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తుంది అనే లెక్కలతో మోడీ పై అవసరానికి మించి మరీ వ్యక్తిగత విమర్శలు చేశారు అని..ఇప్పుడు చంద్రబాబు మోడీ పక్కన చేరినందున కాంగ్రెస్ కూటమి అవకాశాలు మెరుగుపడే ఛాన్స్ ఉంది అంటూ ఒక నేత అభిప్రాయపడ్డారు. ఇటు జగన్ మోహన్ రెడ్డి, అటు చంద్రబాబులు ఇద్దరూ కూడా ఆంధ్ర ప్రదేశ్ కు ప్రధాని మోడీ తీరని అన్యాయం చేస్తున్నా కూడా ఎవరి మోడల్ లో వాళ్ళు ఆయనకు మద్దదు ఇస్తూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు అని ఐఏఎస్ అధికారులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఎక్కడివరకో ఎందుకు స్వయంగా ప్రధాని మోడీ శంఖుస్థాపన చేసిన రాజధాని, చంద్రబాబు కలల అమరావతి ప్రాజెక్ట్ ను సీఎం జగన్ నాలుగున్నర సంవత్సరాలుగా అట కెక్కించినా కూడా మోడీ ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అయినా మోడీ దగ్గర చంద్రబాబు కు తప్పేమి కనిపించటం లేదు. కేంద్రం అండ లేకుండా సీఎం జగన్ ఇలా చేయగలరా?. మరో వైపు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న అడ్డగోలు అప్పులతో పాటు అన్నింటికీ కేంద్రం సహకరిస్తుంది అని రాష్ట్రంలో టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తారు..ఢిల్లీ కి పోయి మాత్రం చంద్రబాబు మోడీ భజన చేస్తున్నారు అంటే ఏదో లెక్క తేడా ఉంది అనే చర్చ సాగుతోంది.

Next Story
Share it