వివేకా హత్యపై జగన్ బయటికొచ్చి సమాధానం చెప్పాలి
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి బహిర్గతం అవుతున్న పలు విషయాలు ఏపీలో దుమారం రేపుతున్నాయి. సీబీఐ అధికారుల ముందు పలువురు ఇచ్చిన వాంగ్మూలాలతో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు వివేకా హత్యకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్యను వైసీపీ గతంలో తనపై నెట్టాలని చూసిందని.ఇప్పుడు వాంగ్మూలాలు పరిశీలిస్తే అన్నీ జగనే దోషి అని చెబుతున్నాయని ఆరోపించారు. వివేకా హత్యలో సిఎం జగన్ పూర్తిగా కూరుకుపోయారని చంద్రబాబు అన్నారు. సోమవారం ఆయన పార్టీ స్ట్రాటజీ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబాయ్ హత్య ఘటనతో జగన్ నైతికంగా పూర్తిగా పతనం అయ్యారన్నారు. హత్య కేసులో సిబిఐ దర్యాప్తు చేస్తే... ఏమవుతుంది?... 12వ కేసు అవుతుందని జగన్ వ్యాఖ్యానించడమంటే అతనికి చట్టం అంటే లెక్కలేనితనాన్ని స్పష్టం చేస్తోందన్నారు.
వివేకా హత్యను రాజకీయంగా వాడుకున్న సీఎం జగన్ ఇప్పుడు బయటకు వచ్చి సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. బాబాయ్ హత్యలో సూత్రధారి ఎవరనేది ఇప్పుడు తేలిపోయిందన్నారు. ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలన్నారు. ఆనాడు గ్యాగ్ అర్డర్ తేవడం నుంచి.... ఇప్పుడు సిబిఐ విచారణను తప్పు పట్టడం వరకు హత్య కేసులో జగన్ ప్రమేయాన్ని స్పష్టం చేస్తున్నాయన్నారు. ప్రతి సమస్యకు, ప్రతి ప్రశ్నకు డైవర్ట్ పాలిటిక్స్ అమలు చేస్తున్న జగన్.... ఈ విషయంలో ప్రజలను ఏమార్చలేరన్నారు. హత్యను పాత్రధారులకే పరిమితం చేసి సూత్రధారుల్ని బోనులో నిలబెట్టకపోతే రాష్ట్రంలో ఏ పౌరుని ప్రాణాలకైనా రక్షణ ఉంటుందా? అని ప్రశ్నించారు. వైఎస్ కోటలోనే వైఎస్ తమ్ముణ్మి హత్యచేయడం అంత:పుర పెద్ద ప్రోత్సాహం లేకుండా సాధ్యమా? అన్నారు.