Telugu Gateway
Politics

పశ్చిమ బెంగాల్ లో బిజెపికి అంత సీన్ లేదు

పశ్చిమ బెంగాల్ లో బిజెపికి అంత సీన్ లేదు
X

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బిజెపిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్ లో ఎలాగైనా ఈ సారి అధికారం దక్కించుకోవాలని ఆ పార్టీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. టీఎంసీ ఎమ్మెల్యేలను ఆకర్షిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఆత్మరక్షణలోకి నెట్టే ప్రయత్నం చేస్తోంది. వలసలు కూడా అదే స్థాయిలో సాగుతున్నాయి. ఈ తరుణంలో ప్రశాంత్ కిషోర్ సోమవారం నాడు ఓ ట్వీట్ చేశారు. అంతే కాదు..ఈ ట్వీట్ సేవ్ చేసిపెట్టుకోండి. తాను చెప్పిన దాంట్లో తేడా వస్తే తాను ఈ వ్యవహారం నుంచి కూడా తప్పుకుంటానని ప్రకటించారు.

పశ్చిమ బెంగాల్ లో బిజెపికి రెండంకెల సంఖ్య దాటడానికే చాలాకష్టం అని పేర్కొన్నారు. బిజెపి అనుకూల మీడియా ఎక్కువ చేసి చూపుతోందని అన్నారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో మమతాకు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్నారు. 200 సీట్లలో విజయం సాధించి బెంగాల్‌లో ఈసారి అధికారం చేపడుతామన్న అమిత్ షా ఎత్తుగడ ఇక్కడ సాగదన్నారు. బెంగాల్‌లో అమిత్‌ షా ఎన్నికల ప్రచారం ముగిసిన మరుసటి రోజే పీకే ఈ వ్యాఖ్యలు చేయటం విశేషం.

Next Story
Share it