వైసీపీ సర్కారును కూల్చేందుకు బిజెపి ప్రయత్నం
ఏపీ సమాచార, రవాణా శాఖల మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో కలకలం రేపాయి. వైసీపీ సర్కారును కూల్చేందుకు బిజెపి ప్రయత్నాలు చేస్తోందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. కాషాయ కండువా కప్పుకున్న వ్యక్తి సీఎం కావాలన్నది బిజెపి ఆశ అన్నారు. టీడీపీ, బిజెపి కుమ్మక్కు అయ్యే పార్టీలన్నారు. గతంలో మోడీని తిట్టి ఇప్పుడు ప్రేమ లేఖలు రాస్తున్నారని విమర్శించారు. మంత్రివర్గ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన పేర్ని నాని ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అప్పుల పరిస్థితిపై మీడియా ప్రశ్నలు సంధించిన వేళ మంత్రి తీవ్రంగా స్పందించారు. అప్పులు చేయని వాడు ఎవడు అంటూ ప్రశ్నించారు.
కేంద్రం ఓ వైపు భారీగా అప్పులు చేస్తూ తమను విమర్శించటం ఏమిటన్నారు. ఈ గురివింద గింజలు మాకు చెప్పటం ఏమిటని ప్రశ్నించారు. యాంత్రిక తప్పిదం వల్లే పులిచింతలలో 16వ గేటు విరిగినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి బాధ్యులు ఎవరు అయినా వదిలిపెట్టేదిలేదన్నారు. మాన్యువల్ గేట్ల స్థానంలో హైడ్రాలిక్ గేట్ల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సీఎం జగన్ ఆదేశించారన్నారు. ఎగువ నుంచి వచ్చే ప్రవాహంతో పులిచింతల మళ్ళీ నిండుతుందని..క్రిష్ణా డెల్టా రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.