స్టాక్ డైలాగుల బీజేపీ రాజకీయం

నిన్న మొన్నటివరకు కర్ణాటకలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై వచ్చినన్ని అవినీతి ఆరోపణలు ఎక్కడా రాలేదు అనే చెప్పొచ్చు. కానీ కర్ణాటకలో బీజేపీ పాలించినంత కాలం అసలు ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు కీలక నేతలు. ఇప్పుడు మరో విశేషం ఏమిటి అంటే తాజాగా తెలంగాణ, బీజేపీ రాష్ట్ర శాఖల మాజీ అధ్యక్షులు బండి సంజయ్, సోము వీర్రాజులను బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంటే తెలంగాణలో ఫైటింగ్ స్పిరిట్ చూపించిన బండి సంజయ్ కు అదే పదవి...ఆంధ్ర ప్రదేశ్ లో అధికార వైసీపీ తో కలిసి పార్టీ ని దెబ్బతీశారు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సోము వీర్రాజు కు అదే పదవి. మరి ఇందులో తెలంగాణాలో నిన్న మొన్నటి వరకు పార్టీ కి మంచి ఊపు తెచ్చిన బండి సంజయ్ కు ప్రత్యేకంగా దక్కిన గౌరవం ఏముంది అని కొంత మంది బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఉత్తరాదిన ఎలా ఉందో కానీ ఇక్కడ మాత్రం తమ పార్టీ రాజకీయాలు కామెడీని తలపిస్తున్నాయని బీజేపీ సీనియర్ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.



