హుజూరాబాద్ నోటిఫికేషన్ కోసం ఈసీపై బిజెపి ఒత్తిడి
తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు బిజెపికి పలు ప్రశ్నలు సంధించారు. అదే సమయంలో బిజెపిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దళిత బంధుపై కొద్ది మంది బీజేపీ నేతలు ఎన్నికలసంఘానికి ఫిర్యాదు చేశారన్నారు. తొందరగా ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం పై ఒత్తిడి తెస్తున్నారని, దీనివల్ల దళిత బంధు పథకం ఆగిపోతుందని వీరి ఆశ అని విమర్శించారు. హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ గెలిస్తే వచ్చే లాభం ఏమిటని ప్రశ్నించారు. హుజూరాబాద్ లో గెలిస్తే ఆయనకు మాత్రమే లాభం.. అక్కడి అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. వ్యక్తి ప్రయోజనమా....హుజూరాబాద్ ప్రజల ప్రయోజనమా..అన్న చర్చ పెట్టాలన్నారు. దళిత బందు హుజూరాబాద్ లో వద్దని ఈటల రాజేందర్ అంటున్నారు. కళ్యాణ లక్ష్మి, రైతు బంధు పరిగ ఏరుకున్నట్లు అవసరం లేదన్నారు. బీజేపీ వైఖరేంటో బండి సంజయ్ ప్రకటించాలకని డిమాండ్ చేశారు. హుజూరాబాద్ లో ఓట్లు అడిగే ముందు కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, దళిత బంధుపై బీజేపీ వైఖరి తేల్చిచెప్పాలన్నారు. దళితబంధు పెడితే ఎన్నికలకోసం అంటున్నారు.
గత మార్చి నెలలో బడ్జెట్ లోనే దళితుల అభ్యున్నతికి 1200. కోట్లతో దళిత ఎంపవర్ మెంట్ స్కీం ను ఆర్థిక మంత్రిగా అసెంబ్లీలో నేను ప్రకటించానని తెలిపారు. దళితులు బాగుపడటం బీజేపీ కు ఇష్టం లేదన్నారు. హుజూరాబాద్ లో అసలు బీజేపీ వాళ్లు ఎం చెప్పి ఓట్లు అడుగుతారు.ఏడాదికి రెండు కోట్లఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇవ్వ నందుకు ఓట్లు అడుగుతారా . పెట్రోల్, డిజీల్, గ్యాస్ ధరలు పెంచామని చెప్పి ఓట్లు అడుగుతారా. గత ఏడాది వ్యవసాయ పనుల కోసం ట్రాక్టర్ కిరాయి ఎకరానికి 3 వేలు ఉంటే, నేడు ఎకరానికి ఐదు వేలు అడుగుతున్నారు. డిజీల్ ధర అరవై రూపాయల నుండి నూటా ఆరు రూపాయల కు పెంచి రైతుల నడ్డి విరిచినందుకు ఓట్లు అడుగుతారా. కేసీఆర్ ఐదు వేలు రైతు బందు కింద రైతులకు ఇస్తే డిజీల్ ధరలు పెంచి బీజేపీ ప్రభుత్వం 2500 రూపాయలు ఇంకో చెత్తో తీసుకుంటోంది. ప్రభుత్వ రంగ సంస్థలు ను ప్రయివేటీకరిస్తూ ఉద్యోగాలు ఊడగొడుతుంది అంటూ విమర్శలు చేశారు.