Telugu Gateway
Politics

హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ఓడిపోతే కెసీఆర్ రాజీనామా చేస్తారా?

హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ఓడిపోతే కెసీఆర్ రాజీనామా చేస్తారా?
X

బండి సంజ‌య్ స‌వాల్

టీఆర్ఎస్ కు అసెంబ్లీలో ఆర్ఆర్ఆర్ సినిమా చూపిస్తాం

అసెంబ్లీలో అధికార టీఆర్ఎస్ కు ట్రిపుల్ ఆర్ఆర్ఆర్ సినిమా చూపిస్తామ‌ని తెలంగాణ బిజెపి ప్రెసిడెంట్ బండి సంజ‌య్ వ్యాఖ్యానించారు. హుజూరాబాద్ లో ఈటెల రాజేందర్ గెలిస్తే అంద‌రూ ఆర్ తో పేర్లు ప్రారంభం అయ్యేవారే ఉంటారు. రాజాసింగ్, ర‌ఘునంద‌న్ రావు, రాజేంద‌ర్. అందుకే బండి సంజ‌య్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ఓడిపోతే సీఎం కెసీఆర్ త‌న ప‌దవికి రాజీనామా చేస్తారా అని స‌వాల్ విసిరారు. హుజూరాబాద్ కార్యకర్తల సమావేశంలో బండి సంజ‌య్ 'ఎన్నికల శంఖారావం' పూరించారు. కాషాయ కంకణం కట్టుకుందాం....బీజేపీని గెలిపిద్దామంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమంటూ ప్రగల్భాలు పలుకున్నారు క‌దా. ''హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ఓడిపోతే సీఎం పదవికి రాజీనామా చేసేందుకు సిద్దమా?. కేసీఆర్ కు దమ్ముంటే సమాధానమివ్వాలి''అంటూ సవాల్ విసిరారు. హుజూరాబాద్ లో సైలెంట్ ఓటింగ్ జరగబోతోందని, బీజేపీ గెలుపును అడ్డుకోవడం ఇక ఎవరి తరమూ కాదని అన్నారు.టీఆర్ఎస్ పార్టీ కరెన్సీ నోట్లతో ఓట్లను కొనుగోలు చేసి గెలవాలని చూస్తోంది. ఓటుకు రూ.10 వేలు ఇస్తోంది. ఈటల రాజేందర్ అసలు సిసలైన తెలంగాణ ఉద్యమకారుడు. తెలంగాణ వాదాన్ని విన్పించారు. ఆనాడు తెలంగాణ రావాలని కేసీఆర్ కు అసలు ఇష్టమే లేదు. విద్యార్థుల భయానికి మాత్రమే దొంగ దీక్ష చేశారే తప్ప ఏనాడూ తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం లేదు. ఉద్యమం పేరుతో డబ్బులు సంపాదించుకుని చలామణి కావాలన్నదే కేసీఆర్ ధ్యేయమ‌న్నారు. టీఆర్ఎస్ పార్టీ బరితెగింపు రాజకీయాలు చేస్తోంది. ఇక్కడి ప్రజలు, బీజేపీ నేతలు బరి గీసి టీఆర్ఎస్ తో కొట్లాడుతున్నరు. బీజేపీ కార్యకర్తలంతా ప్రతి ఒక్కరూ ప్రతి గడప గడపకూ వెళ్లాలి...ప్రతి ఓటరును కలవాలి. ఓటు అడగాలి.

బీజేపీని గెలిపించాలి. టీఆర్ఎస్ వాళ్లు ఓటుకు రూ.10 వేలిస్తున్నరు. అయినా సరే బీజేపీ అత్యధిక మెజారిటీతో గెలవబోతోంది. టీఆర్ఎస్ కు డిపాజిట్ కూడా దక్కదు. తూతూ మంత్రంగా టీఆర్ఎస్ గెలుస్తుందని కేసీఆర్ ప్రగల్భాలు పలుకుతుండు. దళిత బంధును ఏనాడూ బీజేపీ వ్యతిరేకించలేదు. ఏ షరతు లేకుండా దళితులకు రూ.10 లక్షలు ఇస్తున్నమని ప్రకటించిండు. ఇప్పడేమో అన్నీ షరతులు పెడుతుండు. బ్యాంకు అధికారులను హెచ్చరిస్తున్నా....వాళ్లంటే నాకు గౌరవం. కానీ ఈరోజు బ్యాంకు అధికారులు చేస్తున్నటువంటి తప్పుడు నిర్ణయాలతో వాళ్ల ఉద్యోగాలు ఊడిపోవడం ఖాయం. దళితులు డబ్బులు డ్రా చేసుకోకుండా ఫ్రీజ్ చేసే అధికారం బ్యాంకు అధికారులకు ఎక్కడిది? అకౌంట్లో డబ్బులు వేసే ప్రభుత్వం తరువాత షరతులతో మళ్లీ వాపస్ తీసుకోవడం ఖాయం. ఎన్నికలయ్యాక ఆ పథకాన్ని అటకెక్కిస్తుండు. బ్యాంకు అధికారులకు దళిత బంధు డబ్బులను ఫ్రీజ్ చేసే అధికారం లేదు. మేం ఫిర్యాదు చేస్తే మీ ఉద్యోగాలు ఊడిపోయవడం ఖాయం. గతంలో కోర్టులు ఈ విషయంలో మెట్టికాయలు కూడా పెట్టింది. మీ తీరు మార్చుకోవాలన్నారు.

Next Story
Share it