Telugu Gateway
Politics

బిజెపి సిట్టింగ్ ఎంపీ సంచ‌ల‌న నిర్ణ‌యం

బిజెపి సిట్టింగ్ ఎంపీ సంచ‌ల‌న నిర్ణ‌యం
X

కొద్ది రోజుల క్రితం జ‌రిగిన కేంద్ర మంత్రివ‌ర్గ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌లో ఆయ‌న మంత్రి ప‌ద‌వి పోయింది. రాజీనామా చేయ‌మ‌న్న‌ప్పుడే ఆయ‌న షాక్ కు గుర‌య్యారు. ప్ర‌దాని మోడీ నిర్ణ‌యం ఆయ‌న్ను ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. బ‌హుశా దాని ప‌ర్య‌వ‌సాన‌మే అన్న‌ట్లు ఆయ‌న రాజ‌కీయాల‌కు శాశ్వ‌తంగా గుడ్ బై చెబుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. త్వ‌ర‌లోనే ఎంపీ ప‌ద‌వికి కూడా రాజీనామా చే్య‌నున్న‌ట్లు తెలిపారు. ఈ నిర్ణ‌యం ఒక్కసారిగా పెద్ద సంచ‌ల‌నంగా మారింది. ఈ ప్ర‌క‌ట‌న చేసింది కేంద్ర మాజీ మంత్రి బాబుల్ సుప్రియో. త‌న నిర్ణ‌యానికి సంబంధించి ఆయ‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. బాబుల్ సుప్రియో నిర్ణ‌యం పశ్చిమ బెంగాల్‌తో పాటు ఢిల్లీలో బీజేపీకి పెద్ద షాక్ గా మారింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన బాబుల్‌ సుప్రియో ప్రముఖ గాయకుడు. బీజేపీలో 2014 నుంచి కొనసాగుతున్నాడు. 'అల్విదా.. నేను తృణమూల్‌, కాంగ్రెస్‌, సీపీఎం.. ఇలా ఏ పార్టీలోకి చేరడం లేదు. ఆ పార్టీల్లోకి రావాలని నన్ను ఎవరూ పిలవలేదు. నేను ఒకే టీం ప్లేయర్‌ను. ఎప్పటికీ ఒకే పార్టీ (బీజేపీ)లో ఉంటా. నా వల్ల కొంతమంది సంతోషపడగా.. మరికొందరు బాధపడ్డారు. సుదీర్ఘ చర్చల అనంతరం నేను ఒక నిర్ణయం తీసుకున్నా. రాజకీయాల నుంచి వైదొలుగుతున్నా. రాజకీయాల్లో ఉండి సామాజిక సేవ చేయడం అసాధ్యం. నన్ను తప్పుగా అనుకోకండి' అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. 2014 ఎన్నికల సమయంలో ఆయ‌న బీజేపీలో చేరి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.

సార్వత్రిక ఎన్నికల్లో అస్సనోల్‌ నుంచి పోటీ చేసి తొలిసారి ఎంపీగా గెలిచారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తొలి మంత్రివర్గంలో బాబుల్‌ సుప్రియో చేరారు. పట్టణ అభివృద్ధి సహాయ మంత్రిగా పని చేశారు. 2019 ఎన్నికల్లో మళ్లీ అస్సనోల్‌ నుంచి గెలుపొంది కేంద్రమంత్రిగా నియమితులయ్యారు. తాజాగా జరిగిన పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా బాబుల్‌ సుప్రియోను బీజేపీ బరిలో దింపింది. అనూహ్యంగా సుప్రియో తృణమూల్‌ కాంగ్రెస్‌ చేతిలో పరాజయం పొందాడు. దీంతోపాటు రాష్ట్రంలో బీజేపీ ఆశించిన ఫలితాలు పొందలేదు. ఇది దృష్టిలో ఉంచుకుని బీజేపీ అధినాయకత్వం కేంద్ర మంత్రివర్గం నుంచి ఆయనను తొలగించింది. ఈ క్రమంలోనే ఆయన మనస్తాపానికి గురయ్యారు. బీజేపీకి రాజీనామా చేసి తృణమూల్‌లో చేరుతారని వార్తలు వినిపించగా అనూహ్యంగా ఆయన రాజకీయాల నుంచే తప్పుకుంటున్నట్లు ప్రకటించడం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Next Story
Share it