Telugu Gateway
Politics

ఢిల్లీకి చేరిన జ‌లజ‌గ‌డం..మోడీకి జ‌గ‌న్ లేఖ‌

ఢిల్లీకి చేరిన జ‌లజ‌గ‌డం..మోడీకి జ‌గ‌న్ లేఖ‌
X

తెలంగాణ‌, ఏపీ స‌ర్కార్ల మ‌ధ్య నెల‌కొన్న జ‌ల వివాదం ఢిల్లీకి చేరింది. ఈ అంశంపై ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గురువారం నాడు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ, కేంద్ర జ‌ల‌శ‌క్తి శాఖ మంత్రి గ‌జేంద్ర‌సింగ్ షెకావ‌త్ కు విడివిడిగా లేఖ‌లు రాశారు. తక్షణ‌మే ఈ జల వివాదంపై కేంద్రం జోక్యం చేసుకోవాలని సీఎం జగన్ కోరారు. విద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణ అక్రమంగా వాడుకుంటున్న నీటిని నిలుపుదల చేయాలంటూ లేఖలో సీఎం పేర్కొన్నారు. కృష్ణా బోర్డు పరిధిలో ఉన్న అన్ని ప్రాజెక్టుల వద్ద కేంద్ర బలగాలతో భద్రతా ఏర్పాట్లు చేయాలని కోరారు. ''విద్యుత్ ఉత్పత్తికి నీటిని విడుదల చేయ‌వ‌ద్దన్న ఆదేశాలున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ నీటిని విడుదల చేస్తోంది. ఈ చర్యలు అంతర్రాష్ట్ర సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపేలా ఉన్నాయి. కింది ప్రాంతాల హక్కులను కాలరాసేలా తెలంగాణ చర్యలున్నాయి. తెలంగాణ చర్యల వల్ల రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల తాగునీరుకు కూడా సమస్యలు తలెత్తుతాయి. ఎలాంటి వ్యవసాయ అవసరాలు లేకున్నా నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ నీళ్లను వాడుకుంటోందని'' సీఎం జగన్ త‌న లేఖలో ప్రస్తావించారు.

విద్యుత్‌ ఉత్పత్తి వద్దన్న కృష్ణా రివర్‌ బోర్దు ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం బేఖాతరు చేస్తోంది. తెలంగాణ అక్రమ వాడకంపై జూన్‌ 10న ఫిర్యాదు చేశాం. దీనిపై కృష్ణా రివర్‌ బోర్డు తెలంగాణకు లేఖ రాసింది. తక్షణం విద్యుదుత్పత్తి నిలిపివేయాలని బోర్డు తెలంగాణకు సూచించింది. బోర్డు ఆదేశాలను తెలంగాణ పూర్తిగా బేఖాతరు చేసింది. జూన్‌ 23న, 29న మరోసారి కృష్ణా బోర్డు ఆదేశాలిచ్చింది. అక్రమంగా చేస్తున్న నీళ్ల వాడకం ఆపాలని తెలంగాణకు సూచించింది. కృష్ణా రివర్‌ బోర్డు ఆదేశాలిచ్చినా తెలంగాణ పట్టించుకోవడం లేదని'' సీఎం జగన్‌ లేఖలో పేర్కొన్నారు. ''ప్రస్తుతం శ్రీశైలంలో కేవలం 808 అడుగుల వరకే నీళ్లున్నాయి. 33 టీఎంసీలు తక్కువగా ఉన్నా.. తెలంగాణ నీళ్లు వాడేస్తోంది. వాళ్ల ప్రాంతంలో పవర్‌ హౌజ్‌ ఉంది కాబట్టి ఇష్టానుసారంగా విద్యుదుత్పత్తి పేరిట నీళ్లు వాడుతున్నారు. ప్రతీ రోజు తెలంగాణ 2 టీఎంసీల నీటిని విడుదల చేస్తోంది. కేఆర్‌ఎంబీ పరిధిని స్పష్టంగా నిర్వహించాలి. కేఆర్‌ఎంబీ పరిధిని నోటిఫై చేయాలని'' లేఖలో సీఎం జగన్‌ కోరారు.

Next Story
Share it