Telugu Gateway
Cinema

వర్మ 'మర్డర్' సినిమాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

వర్మ మర్డర్ సినిమాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
X

రామ్ గోపాల్ వర్మ సినిమా ఏదైనా సరే వివాదంతోనే మొదలవుతుంది. ఆ వివాదాలే ఆయనకు పెట్టుబడి..ప్రచారం. సినిమాకు రావాల్సినంత హైప్ ఈ వివాదాలతో తెచ్చుకుంటారు. కానీ అవి కూడా పెద్దగా వర్కవుట్ అవుతున్న దాఖలాలు లేవు. అయినా సరే ఆయన తన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఏ వివాదస్పద, సున్నిత అంశం దొరికినా వర్మ వెంటనే రంగంలోకి దిగుతారు. దానిపై సినిమా ప్రకటన చేస్తారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇదే సాగుతోంది. అదే మోడల్ లో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'మర్డర్' సినిమాకు శుక్రవారం నాడు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమా విడుదలను నిలిపివేయాలంటూ నల్గొండ కోర్టు ఇచ్చిన స్టేను హైకోర్టు కొట్టివేసింది. నల్లగొండ జిల్లాలో సంచలనం సృష్టించిన ప్రణయ్‌, అమృతల ప్రేమకథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పరువు కోసం అమృత తండ్రి మారుతీ రావు ప్రణయ్‌ను హత్య చేయించారు. ఇదే కథాంశంగా సినిమాను తెరకెక్కించాలని రామ్‌ గోపాల్‌వర్మ నిర్ణయించుకున్నారు.

తమ అనుమతి లేకుండా రామ్‌గోపాల్‌వర్మ సినిమాను తీస్తున్నారంటూ అమృత కోర్టును ఆశ్రయించింది. అమృత మొదట నల్గొండ కోర్టును ఆశ్రయించగా చిత్ర విడుదలను నిలుపుదల చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ విషయంపై వర్మ హైకోర్టును ఆశ్రయించగా సినిమాలో ప్రణయ్‌, అమృత పేర్లు, ఫోటోలు, వీడియోలు వాడకూడదని షరతు విధించింది. వారి పేర్లు వాడబోమని చిత్ర యూనిట్ హామీ ఇవ్వడంతో ఇక ఏ అడ్డంకులు లేకుండా విడుదల కానుంది. మర్డర్‌ చిత్రం తెరకెక్కడం వెనుక ఉన్న మా మంచి ఉద్దేశాన్ని కోర్టు అర్థం చేసుకుంది. అన్ని విషయాలను కోర్టు ఆర్డర్‌ వచ్చిన తరువాత వెల్లడిస్తాను అంటూ వర్మ ట్వీట్‌ చేశారు.

Next Story
Share it