పూజా హెగ్డే కు సోషల్ మీడియా షాక్..వివరణ
టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా ఉన్న పూజా హెగ్డే సోషల్ మీడియా దెబ్బకు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దక్షిణాది ప్రేక్షకులకు బొడ్డు, నడుం అంటే వ్యామోహంలో ఉంటారు' అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే వివాదానికి కారణం అయ్యాయి. దీంతో పూజాపై సోషల్ మీడియాలో అభిమానులు ఫైర్ అయ్యారు. ఓ వైపు తెలుగులో అవకాశాలు అందిపుచ్చుకుంటూ ఇక్కడ నుంచి లబ్దిపొందుతూ తెలుగు ప్రేక్షకులపై విమర్శలా అంటూ మండిపడ్డారు. ఇక సోషల్ మీడియాలో ఎలా ఉంటుందో తెలుసు కదా?. చాన్స్ వస్తే ఓ ఆటాడుకుంటారు.
పూజా విషయంలోనూ అదే చేశారు. దీంతో అమ్మడు దిగొచ్చి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ మేరకు ఓ వివరణ లేఖను విడుదల చేశారు. అక్షరాన్ని మార్చగలరేమో కానీ అభిమానాన్ని కాదని అన్నారు. తనకు తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎప్పటికీ ప్రాణ సమానమని పేర్కొన్నారు. ఇది తన చిత్రాలను అభిమానించే వారికీ, తన అభిమానులకు తెలిసినా.. ఎటువంటి అపార్థాలకు తావివ్వకూడదనే మళ్లీ చెబుతున్నానని స్పష్టం చేశారు. తనకు ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టిన తెలుగు ఇండస్ట్రీకి ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. తన ఇంటర్వ్యూను మొత్తం చూస్తే మీకే అన్నీ అర్థమవుతాయని సూచించారు.