Telugu Gateway
Cinema

చిరంజీవికి కరోనా..రెండు రోజుల క్రితమే కెసీఆర్ తో భేటీ

చిరంజీవికి కరోనా..రెండు రోజుల క్రితమే కెసీఆర్ తో భేటీ
X

హీరో చిరంజీవికి కరోనా నిర్ధారణ అయింది. ఎలాంటి లక్షణాలు లేకపోయినా ఆచార్య సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు రెడీ అవుతున్న తరుణంలో పరీక్ష చేయించుకోగా ఈ విషయం బయటపడింది. దీంతో ఆయన వెంటనే హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లారు. గత నాలుగైదు రోజులుగా తనను కలసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని చిరంజీవి ట్విట్టర్ ద్వారా కోరారు. ఎప్పటికప్పుడు తన ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తానన్నారు. శనివారం నాడే చిరంజీవి మరో హీరో నాగార్జునతో కలసి తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ తో సమావేశం అయ్యారు.

సీఎం కెసీఆర్ ను కలసిన సమయంలో అటు చిరంజీవి, ఇటు నాగార్జునలు కూడా మాస్క్ లు పెట్టుకోలేదు. అయితే చిరంజీవి తన మాస్క్ ను చేతిలో పట్టుకుని ఉన్న విషయాన్ని ఫోటోలో చూడొచ్చు. కరోనాపై విస్తృత ప్రచారం చేసి జాగ్రత్తలు చెప్పిన చిరంజీవి ముఖ్యమంత్రిని కలసినప్పుడు మాస్క్ లు లేకుండా ఉండటం, ఇప్పుడు ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలటంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

Next Story
Share it