సాయిధరమ్ తేజ్ పై కేసు నమోదు
బైక్ ప్రమాదంతో గాయాలపాలైన హీరో సాయిధరమ్ తేజ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. బైక్ రాష్ డ్రైవింగ్ చేసినందున ఆయనపై రాయదుర్గం పోలీసులు ఈ కేసు నమోదు పెట్టారు. నిర్లక్ష్యంగా, అతి వేగంగా బైక్ నడిపినందుకు ఐపీసీ సెక్షన్ 336, 184 సెక్షన్ల పై కేసు నమోదు చేసి అతని బైక్ ని స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ లో సాయి ధరమ్ తేజ్ తోపాటు మరో బైక్ కూడా ఉండటంతో వీరు రేసు పెట్టుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలోనూ విచారణ చేస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ తోపాటు నరేష్ కుమారుడు ఇలా బైక్ లు నడుతారనే విషయం వెల్లడైంది. స్వయంగా నరేష్ కూడా బైక్ ల అంశాన్ని స్వయంగా వెల్లడించారు. ఇదిలా ఉంటే శుక్రవారం రాత్రి హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దాటి ఐకియా వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయితేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్లగా, ఆయనను 108 సాయంతో సమీపంలోని మెడికవర్ ఆస్పత్రికి తరలించారు.అక్కడ ప్రాథమిక చికత్స పూర్తయ్యాక మెరుగైన చికిత్స కోసం అపోలోకి తరలించి చికిత్స అందిస్తున్నారు. సాయిధరమ్ తేజ్ పై కేసు నమోదు చేయటంపై ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ స్పందించారు. సాయిధరమ్ పై కేసు పెట్టిన పోలీసులు రోడ్డుపై ఇసుక వేయటానికి కారణమైన నిర్మాణ కంపెనీతోపాటు రోడ్డును సరిగా ఉంచాల్సిన మున్సిపల్ సిబ్బందిపై కూడా కేసు నమోదు చేయాలన్నారు. దీంతో అయినా ఇతర ప్రాంతాల్లో ఇలాంటి ప్రమాదాలు జరక్కుండా జాగ్రత్తలు తీసుకుంటారని సోషల్ మీడియా వేదికగా స్పందించారు.