సిని'మా' సమస్యలు పరిష్కరించండి
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఎక్కడి నుంచైనా పదే పదే డిమాండ్లు వస్తున్నాయంటే అది ఒక్క టాలీవుడ్ నుంచే. సిని'మా' సమస్యులు పరిష్కరించాలంటూ ప్రముఖ నిర్మాతలు కోరుతున్నారు. ఇప్పటికే దిల్ రాజుతోపాటు మరికొంత మంది కీలక నిర్మాతలు బందరు వెళ్ళి మరీ మంత్రి పేర్ని నానితో సమావేశం అయిన సంగతి తెలిసిందే. గురువారం నాడు అల్లు అరవింద్ కూడా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్' ట్రైలర్ విడుదల కార్యక్రమంలో మాట్లాడుతూ సీఎం జగన్ కు సినీ పరిశ్రమలోని సమస్యలను పరిష్కరించాలంటూ విజ్ఞప్తి చేశారు. 'ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి నా విజ్ఞప్తి. సినీ పరిశ్రమలో అనేక సమస్యలున్నాయి, వాటిని త్వరగా పరిష్కరించాలి. కరోనా నుంచి ప్రజలను ఎలా రక్షించారో అలాగే సినీ పరిశ్రమను కూడా రక్షించాలి. సీఎంగా మీరు తలుచుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయి.
సినీ పరిశ్రమ సమస్యలను దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు రిలీజ్ అయ్యే సినిమాల భవిష్యత్తు మీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. సినీ పరిశ్రమ విజయవంతంగా కొనసాగేందుకు సహకరించాలని కోరుతున్నాను..'' అని అన్నారు. అఖిల్ అక్కినేని-పూజా హెగ్డే జంటగా నటించిన సినిమానే 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్'. అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్పై రూపొందిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ఇది. అక్టోబర్ 15న ఈ చిత్రాన్ని గ్రాండ్గా థియేటర్లలో విడుదల చేయనున్నారు.