Telugu Gateway
Andhra Pradesh

విశ్వసనీయత కోల్పోతున్న వైసీపీ

విశ్వసనీయత కోల్పోతున్న వైసీపీ
X

ఒక్కో ఎన్నికకు ఒక్కో కుట్ర సిద్ధాంతం. ఆంధ్ర ప్రదేశ్ లోని అధికార వైసీపీ ఇదే విధానాన్ని నమ్ముకుందా?. ప్రభుత్వ సలహాదారు..వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు చూస్తే ఎవరికైనా ఇదే అనుమానం రాక మానదు. షర్మిల కాంగ్రెస్ లో చేరటం చంద్రబాబు కుట్రే అంటూ సజ్జల రామకృష్ణ రెడ్డి ప్రకటించారు. అంతే కాదు ...వైఎస్ మరణం విషయంలో కాంగ్రెస్ పై అనుమానాలు ఉన్నాయంటూ శనివారం నాడు మీడియా తో మాట్లాడుతూ సజ్జల సంచలన వ్యాఖ్యలు చేశారు. సజ్జల చెప్పినట్లు కాసేపు ఇవే విషయాలు నిజం అనుకుందాం. షర్మిల కాంగ్రెస్ పార్టీ లో చేరకపోయి ఉంటే వై ఎస్ మరణం విషయంలో ఆ పార్టీ పై అనుమానాలు ఉన్నా కూడా ఏమీ మాట్లాడకుండా ఉండేవాళ్ళు అన్నమాట. షర్మిల కాంగ్రెస్ లో చేరిన తరుణంలో.. ఎన్నికల వేళ సజ్జల ఈ మాటలు మాట్లాడటం వెనక మతలబు ఏమిటి?. నిజంగా సజ్జలకు..వైసీపీ కి కాంగ్రెస్ పై అనుమానాలు ఉంటే ఆంధ్ర ప్రదేశ్ లో అత్యంత శక్తివంతంగా ఐదేళ్లుగా అధికారంలో ఉన్న వైసీపీ కానీ..సీఎం జగన్ కానీ ఈ విషయంలో చేసింది ఏమైనా ఉందా అంటే ఖచ్చితంగా ఏమి లేదు అనే చెప్పాలి. లోక్ సభ లో వైసీపీ ఏకంగా ఇరవై రెండు మంది ఎంపీలు కూడా ఉన్నారు. వాళ్ళు ఈ విషయాన్నీ కూడా ఎక్కడ లేవనెత్తిన దాఖలాలు లేవు. ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ లోకి షర్మిల ఎంట్రీ ఖచ్చితంగా ఎంతో కొంత వైసీపీ ఓటు బ్యాంకు కు గండి కొట్టటం ఖాయం అనే భయంతో సజ్జల ఒక వైపు చంద్రబాబు పేరును...మరో వైపు వై ఎస్ హత్య వెనక కాంగ్రెస్ ఉంది అనే అనుమానాలను తెర మీదకు తెచ్చినట్లు కనిపిస్తోంది అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. గత ఎన్నికలకు ముందు ఆంధ్ర ప్రదేశ్ లో సంచలనం రేపిన అంశాలు రెండు. అందులో ఒకటి వై ఎస్ వివేకానంద రెడ్డి హత్య. రెండవది జగన్ పై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన కోడి కత్తి దాడి.

ఈ రెండు ఘటనలు జరిగినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఈ విషయంలో అప్పటి ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై తీవ్రమైన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. వివేకా హత్య వెనక చంద్రబాబు ఉన్నారనే తరహాలో జగన్ సొంత పత్రిక సాక్షిలో అయితే నారాసుర రక్త చరిత్ర అంటూ ప్రచురించింది. కానీ ఈ కేసు ను విచారించిన సిబిఐ అసలు చంద్రబాబు వైపు వేలెత్తి కూడా చూపకుండా..ఇందులో వై ఎస్ భాస్కర్ రెడ్డి, అయన తనయుడు ఎంపీ అవినాష్ రెడ్డి ని నిందితుల జాబితాలో చేర్చింది. వై ఎస్ భాస్కర్ రెడ్డిని ఇదే కేసు లో సిబిఐ అరెస్ట్ కూడా చేసింది. ఈ కేసు విచారణ ఇంకా సాగుతూనే ఉంది. ఇక కోడి కత్తి కేసు విషయంలోనూ చంద్రబాబు, టీడీపీ కుట్ర అంటూ ఆరోపణలు గుప్పించారు. సంచలనం రేపిన ఈ కేసును విచారించిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మాత్రం ఇందులో ఎలాంటి కుట్ర కోణం లేదు అని తేల్చేయటమే కాకుండా..చార్జిషీట్ కూడా దాఖలు చేసింది. వై ఎస్ వివేకా హత్య కేసు, కోడికత్తి కేసు కేసు గత ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి గెలుపులో కీలక పాత్ర పోషించాయనే అంచనాలు ఉన్నాయి. సీఎం జగన్ మోహన్ రెడ్డి, సజ్జలతో పాటు వైసీపీ కీలక నేతలు అందరూ ఈ విషయంలో చంద్రబాబు పై ఆరోపణలు అయితే చేశారు కానీ...ఒక్కటి కూడా ప్రూవ్ చేయలేకపోయారు. దీంతో వీళ్ళు చేసే కుట్ర ఆరోపణలకు ఏ మాత్రం విశ్వసనీయత లేకుండా పోతుంది అని...వీటిని ప్రజలు నమ్మే అవకాశం కూడా లేదు అని వైసీపీ నేతలు కూడా అంగీకరిస్తున్నారు. సజ్జల తాజాగా షర్మిల విషయంలో చేసిన వ్యాఖ్యలను కూడా ఇదే కోణంలో చూస్తారు అని చెపుతున్నారు.

Next Story
Share it