Telugu Gateway
Andhra Pradesh

గత ఎన్నికల జగన్ అస్త్రాలే..ఇప్పుడు షర్మిల ఆయుధాలు

గత ఎన్నికల జగన్ అస్త్రాలే..ఇప్పుడు షర్మిల ఆయుధాలు
X

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఆంధ్ర ప్రదేశ్ లో ఎంత మేర ప్రభావం చూపిస్తుందో తెలియదు కానీ ఆ పార్టీ అధ్యక్షురాలు వై ఎస్ షర్మిల దెబ్బకు మాత్రం అధికార వైసీపీ విలవిలలాడుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగు దేశం పార్టీ..మరో పార్టీ జనసేన కంటే ఎక్కువ దూకుడుగా అధికార వైసీపీ ని, ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి ని టార్గెట్ చేశారు. కాంగ్రెస్ సమావేశాల్లో ఆమె చేస్తున్న విమర్శలు నేరుగా జగన్ కే తగులుతున్నాయి. అంతే కాదు..ఆ పార్టీ ని తీవ్ర ఇరకాటంలో పెడుతున్నాయి. ఇప్పటికే పలు వర్గాల వ్యతిరేకత ఎదుర్కొంటున్న వైసీపీ కి షర్మిల రూపంలో పెద్ద కష్టమే వచ్చిపడింది అనే చర్చ ఆ పార్టీ నేతల్లో సాగుతోంది. బుధవారం సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇండియా టుడే ఛానల్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని..తమ కుటుంబాన్ని కూడా చీల్చింది అంటూ విమర్శలు గుప్పించారు. తమ కుటుంబంలో చీలికకు కారకుడు జగన్ మోహన్ రెడ్డి మాత్రమే అని...దీనికి సాక్ష్యం పైన ఉన్న దేవుడు...తమ తల్లి విజయమ్మ అని షర్మిల వ్యాఖ్యానించారు. వైసీపీ కోసం తాను తన పిల్లలను కూడా వదిలేసి ఎండా..వానలు కూడా పట్టించుకోకుండా కష్టపడ్డానని...జగన్ సీఎం అయ్యేంత వరకు ఒకలా...తర్వాత మరోలా మారిపోయారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ కి ఎప్పుడు అవసరం అయితే..అప్పుడు స్వలాభం చూసుకోకుండా తాను పని చేసినట్లు వెల్లడించారు. తనకు వ్యక్తిగతంగా అన్యాయం చేసిన పర్వాలేదు కాని...తన తండి రాజశేఖర్ రెడ్డి ఆశయాలు నిలబెడితే చాలు అనుకున్నా అని షర్మిల వ్యాఖ్యానించారు. కానీ జగన్ ప్రభుత్వంలో అసలు రాజశేఖర్ రెడ్డి ఆనవాళ్లు కనపడుతున్నాయా అని ఆమె ప్రశ్నించారు. రాజశేఖర్ రెడ్డి పాలనకు..జగన్ పాలనకు అసలు ఏ మాత్రం పోలికే లేదు అన్నారు.

జగన్ చివరకు సొంత ఎమ్మెల్యేలను కూడా కలిసే పరిస్థితి లేదు అంటూ ఘాటు విమర్శలు చేశారు. రాజశేఖర్ రెడ్డి వారసులం అని చెప్పుకోవటం కాదు..పని తీరులో కూడా అది కనపడాలి అన్నారు. కాంగ్రెస్ లో చేరేటప్పుడే తనను టార్గెట్ చేస్తారు...విమర్శిస్తారు అని తెలుసన్నారు. ఎంతో మంది ఆస్తులు అమ్ముకుని త్యాగాలు చేస్తే జగన్ సీఎం అయ్యారు అని...తర్వాత వాళ్ళందరిని పక్కన పెట్టారు అని విమర్శించారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాత్రమే కాదు...అయన ఎమ్మెల్యేలు..ఎంపీలు అందరూ బీజేపీ కి బానిసలుగా మారారు అన్నారు. రాష్ట్రాన్ని కూడా బీజేపీ కి బానిసగా చేశారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ సీఎం అయిన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ కు ఎంతో కీలకం అయిన స్పెషల్ స్టేటస్ ఊసే లేకుండా పోయింది అని..పోలవరం ప్రాజెక్ట్ గురించి ఎప్పుడూ నిలదీసింది లేదు. కనీసం మాట్లాడింది లేదు. రాజధాని కడతామన్నారు. మూడు రాజధానులు అంటూ కన్ ఫ్యూజ్ చేసి..కనీసం ఇప్పుడు రాజధాని ఏంటో కూడా తెలియని పరిస్థితి కల్పించారు అంటూ మండిపడ్డారు. ఇప్పటికే టీడీపీ, జనసేన పొత్తు వైసీపీ కి ఒక పెద్ద సవాల్ గా మారితే..ఇప్పుడు వై ఎస్ షర్మిల ఎటాక్ జగన్ మోహన్ రెడ్డి ని..వైసీపీ ని మరింత చిక్కుల్లో పడేయటం ఖాయంగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో జగన్ వేటిని అయితే ప్రధాన అస్త్రాలుగా చేసుకుని ఎన్నికలకు వెళ్లారో వాటినే షర్మిల ఇప్పుడు తన అస్త్రాలుగా మార్చుకున్నారు. అందులో అత్యంత కీలకం అయింది ప్రత్యేక హోదా అయితే..రెండవది పోలవరం ప్రాజెక్ట్. ఈ రెండింటి విషయంలో జగన్ సర్కార్ సమాధానం చెప్పుకోలేని స్థితిలో ఉండనే చెప్పొచ్చు. రాజధాని గందరగోళం కూడా జగన్ కు మైనస్ అయ్యే అంశాల్లో ఒకటిగా ఉండే అవకాశం ఉంది.

Next Story
Share it