Telugu Gateway
Andhra Pradesh

జగన్ చెప్పింది చేశారా?

జగన్ చెప్పింది చేశారా?
X

కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజే వై ఎస్ షర్మిల వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై ఎటాక్ స్టార్ట్ చేశారు. అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై కూడా విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి క్రిస్టియన్ అయి ఉండి కూడా మణిపూర్ లో జరిగిన అల్లర్ల విషయంలో నోరెత్తి మాట్లాడలేదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్ళవి ప్రాణాలు కావా...వాళ్ళు మనుషులు కారా అంటూ ప్రశ్నించారు. స్వలాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీ కి తాకట్టు పెట్టారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. ప్రతిపక్షంలో ఉండగా ప్రత్యేక హోదాపై దీక్ష చేసిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊసే ఎత్తటం లేదు అన్నారు. ఇప్పుడు హోదా లేదు...ప్యాకేజీ కూడా లేదు అన్నారు. రాష్ట్రంలో ఉన్న ఇరవై ఐదు మంది ఎంపీలు బీజేపీ ఏది చెపితే దానికి తల ఆడించేవారే అని...వైసీపీ నుంచి ఇరవై రెండు మంది ఉంటే...టీడీపీ నుంచి ఉన్న ముగ్గురి ఎంపీలది అదే పరిస్థితి అంటూ ఆరోపించారు. అలాంటప్పుడు వైసీపీ, టీడీపీ కి ఓట్లు వేయటం ఎందుకు దండగ..వేస్తే నేరుగా బీజేపీ కే వేయమని చెప్పండి ఒక పని అయిపోతుంది కదా అంటూ కేంద్రంలోని బీజేపీ, మోడీ సర్కారు విషయంలో వైసీపీ, టీడీపీ అనుసరిస్తున్న వైఖరిని తప్పుపట్టారు. ఆంధ్ర ప్రదేశ్ అప్పులు ఇప్పుడు రికార్డు స్థాయికి చేరాయని...రాష్ట్రంలో దోచుకోవటం...దాచుకోవటమే జరుగుతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

సీఎం జగన్ మూడు రాజధానులు అని...ఇప్పటి వరకు ఒక్కటి కూడా కట్టలేదు అని...రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా మార్చారు అని విమర్శించారు. ఆంధ్ర ప్రదేశ్ అప్పులు పది లక్షల కోట్లకు చేరినా కూడా రాష్ట్రంలో అభివృద్ధి జీరో అన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన వెంటనే షర్మిల తన అన్న, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పై విమర్శలు చేయటంపై ఏ మాత్రం సంశయించలేదు. దీంతో రాబోయే రోజుల్లో..అంటే ఎన్నికల సమయంలో వైసీపీ, టీడీపీ విషయంలో తన స్టాండ్ ఎలా ఉండబోతుందో స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు కనిపిస్తోంది అనే చర్చ సాగుతోంది. అది కూడా జగన్ గతంలో చెప్పిన మాటలను తీసుకుని మరీ ఆమె విమర్శలు చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటి వరకు టీడీపీ, జనసేన చేసే విమర్శలను వైసీపీ గట్టిగా కౌంటర్ ఇస్తూ వస్తోంది. గత ఎన్నికల్లో జగన్ కోసం పనిచేసిన షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ తరపున వైసీపీ ని, జగన్ ను టార్గెట్ చేయటంతో కచ్చితంగా అధికార వైసీపీ ఇరకాటంలో పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఇతర పార్టీలు చెప్పే వాటి కంటే ..ఇప్పుడు షర్మిల చేసే విమర్శలు అందరి దృష్టిని ఆకర్షించటంతో పాటు వైసీపీ కి సమాధానం చెప్పుకోలేని స్థితి కల్పిస్తాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Next Story
Share it