Telugu Gateway
Andhra Pradesh

వైసీపీ అధికారిక వాదనకు షర్మిల రివర్స్ గేర్

వైసీపీ అధికారిక వాదనకు షర్మిల రివర్స్ గేర్
X

వై ఎస్ వివేకా హత్య వెనక ఆర్థిక కారణాలే అంటూ సాగుతున్న ప్రచారాన్ని వై ఎస్ షర్మిల ఖండించారు. ఇది అంతా తప్పుడు ప్రచారం అని...అసలు తన చిన్నాన్న వివేకా పేరు మీద ఆస్తులే లేవని...అన్ని ఆస్తులు తన సోదరి సునీత పేరు మీదే ఉన్నాయని అన్నారు. ఆస్తుల కోసమే హత్య చేస్తే సునీతనే హత్య చేయాలి కానీ..వివేకానంద రెడ్డిని కాదన్నారు. వివేకా పేరు మీద ఉన్న కొద్దిపాటి ఆస్తులు కూడా సునీత పిల్లల పేరు మీద రాశారన్నారు. వైఎస్ వివేకా హత్య కేసు విచారణ కీలక దశకు చేరుకున్న తరుణంలో వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల చేసిన కామెంట్స్ పెద్ద సంచలనంగా మారాయి. వైఎస్‌ వివేకాపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం దారుణమని ఆమె వ్యాఖ్యానించారు.

అన్ని ఆస్తులు ఎప్పటి నుంచో సునీత పేరు మీదే ఉన్నాయని, అలాంటప్పుడు సునీత ఆస్తుల కోసమో లేకపోతే ఆస్తి ఇంకెవరికో రాసిస్తాడనో సునీత ఆలోచన చేసిందనే ఆరోపణల్లో, లాజిక్‌లో అసలు అర్థమే లేదన్నారు.వివేకా ప్రజల మనిషని.. అలాంటి వ్యక్తి గురించి కొన్ని మీడియా హౌస్‌లు పనిగట్టుకుని వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ కథనాలు ప్రసారం చేస్తున్నాయని పేరు చెప్పక పోయినా సాక్షిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆ మీడియా హౌస్‌లకు ఆ అర్హతే లేదని షర్మిల వ్యాఖ్యానించారు. అసలు లేని వ్యక్తి మీద, తనకు తాను సంజాయిషీ ఇచ్చుకోలేని వ్యక్తి మీద కొన్ని మీడియా హౌస్‌లు ఆయన క్యారెక్టర్‌ను కించపరిచేలా వార్తలు, కథనాలు ప్రసారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. మీడియా ప్రశ్నలకు స్పందిస్తూ షర్మిల ఈ సంచలన అంశాలు వెల్లడించారు.

Next Story
Share it