Telugu Gateway
Andhra Pradesh

ఏపీ రాజకీయం లెక్కలు మారాయి

ఏపీ రాజకీయం లెక్కలు మారాయి
X

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయం లెక్కలు మారాయి. మారిన ఈ లెక్కల్లో బీజేపీ లెక్క ఎలా ఉండబోతుంది?. బీజేపీ విషయంలో జగన్ దూకుడు ఉంటుందా..లేక బీజేపీ ని మినహాయించి ఎప్పటిలాగానే టీడీపీ, జన సేన పై ఎటాక్ కే పరిమితం అవుతారా?. ఇవే ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్న అంశాలు. కారణాలు ఏమైనా అటు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ లు కేంద్రంలోని మోడీ సర్కారు విషయంలో పెద్దగా విమర్శలు చేయకుండానే కాలం వెళ్ళదీశాయి. ఆంధ్ర ప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ కి కేంద్రంలోని బీజేపీ ..ముఖ్యంగా నరేంద్ర మోడీ సర్కారు పూర్తి స్థాయి అండదండలు అందించినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉంది. అందుకే ప్రధాని మోడీ శంఖుస్థాపన చేసిన రాజధాని అమరావతిని పక్కన పడేసినా..ఇంకా అనేక విషయాల్లో కూడా జగన్ కు మోడీ అండగా ఉన్నారు అనే విషయం బహిరంగ రహస్యమే. అదే సమయంలో కేంద్రం తీసుకువచ్చిన పలు కీలక బిల్లులకు లోక్ సభ తో పాటు రాజ్య సభలో కూడా వైసీపీ మద్దతు ఇస్తూ వచ్చింది. సార్వత్రిక ఎన్నికల ముందు రాజకీయ లెక్కలు మారాయి. మరి ఇప్పుడు వైసీపీ ఏమి చేస్తుంది? ఇంతకాలం టీడీపీ, జన సేన ను టార్గెట్ చేసిన రీతిలోనే బీజేపీ ని కూడా వైసీపీ టార్గెట్ చేస్తుందా?. ముఖ్యంగా వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి టీడీపీ తో పొత్తుపెట్టుకున్న బీజేపీ పై విమర్శలు చేస్తారా?. ఇదే ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఆసక్తిరేపుతున్న అంశం. బీజేపీ కి చెందిన కీలక నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కొద్ది నెలల క్రితం ఆంధ్ర ప్రదేశ్ పర్యటన సంధర్భంగా జగన్ సర్కారు అవినీతిలో కూరుకుపోయింది అంటూ తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె పీ నడ్డా కూడా తర్వాత ఇదే బాటలో పయనించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసే విషయం తేలిపోవటంతో ఈ మూడు పార్టీ లు ఆంధ్ర ప్రదేశ్ లోని అధికార వైసీపీ ని మరింత టార్గెట్ చేయటం ఖాయం. వైసీపీ కి అటు టీడీపీ, జన సేన ను టార్గెట్ చేయటం పెద్ద ఇబ్బంది కాదు..కానీ బీజేపీ విషయంలో జగన్..వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారు అన్నది రాబోయే రోజుల్లో కానీ తేలదు. వాస్తవానికి టీడీపీ తో ముఖ్యంగా పార్టీ అధినేత చంద్రబాబు తో బీజేపీ కీలక నాయకులు అయిన ప్రధాని మోడీ, అమిత్ షా లకు సదభిప్రాయం లేదు అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. అయినా సరే ఇప్పుడు టీడీపీ, జన సేన కూటమిలో బీజేపీ చేరటానికి నిర్ణయించుకుంది. అంటే వచ్చే ఎన్నికల్లో గెలుపు అవకాశాల ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నారా అనే చర్చ కూడా తెర మీదకు రావటం ఖాయం. ఇక్కడ మరో విచిత్రం ఏమిటి అంటే ఆంధ్ర ప్రదేశ్ లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా బీజేపీ కే మద్దతు ఇస్తాయని ప్రచారం ఉన్న విషయం తెలిసిందే. అయినా సరే కొన్ని సీట్ల కోసం టీడీపీ తో పొత్తుకుబీజేపీ సిద్ధం అయింది అంటే దీని వెనక ఎవరి లెక్కలు వాళ్లకు ఉండి ఉంటాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Next Story
Share it