Telugu Gateway
Andhra Pradesh

అప్పుడు పవన్ రాలేదు ..ఇప్పుడు నేను రాను !

అప్పుడు పవన్ రాలేదు ..ఇప్పుడు నేను రాను !
X

ఇదేనా లోకేష్ చెప్పదలచుకున్నది?

క్యాబినెట్ కు డుమ్మాకొట్టి ఎల్జీ కి శంఖుస్థాపనకా ?

క్యాబినెట్ ముందో.. తర్వాతో వెళ్ళొచ్చుగా?!

క్యాబినెట్ ను కామెడీ చేస్తున్నారు అంటూ వాపోయిన సీనియర్ మంత్రి

ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కీలక కంపెనీ. ఎల్జీ వంటి కంపెనీ ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీసిటీ కి రావటం కూడా శుభ పరిణామమే. అది కూడా ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడి ప్రతిపాదనతో. ఈ యూనిట్ సాధన విషయంలో ప్రభుత్వ కృషి కంటే కూడా శ్రీసిటీ యాజమాన్యం..మార్కెటింగ్ కీలక పాత్ర పోషించింది అనేది అధికార వర్గాలు చెపుతున్న మాట. రాష్ట్రానికి వచ్చిన ఎల్జీ వంటి కీలక కంపెనీకి ప్రభుత్వం అందరిలాగే...కావాలంటే ఇంకా ఎక్కువే రాయితీలు..ప్రోత్సహకాలు ఇస్తుంది కాబట్టి సహజంగా ఇది ప్రభుత్వ ఖాతాలోకి వెళుతుంది. దీనిపై కూడా పెద్దగా అభ్యంతరాలు ఉండాల్సిన అవసరం లేదు. కానీ మే 8 వ తేదీన అంధ ప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ఉంటుంది అని ఎప్పుడో ఫిక్స్ అయింది. కానీ మంత్రి నారా లోకేష్ మంత్రి వర్గ సమావేశానికి డుమ్మా కొట్టి మరీ శ్రీసిటీ లో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ శంఖుస్థాపన కార్యక్రమంతో పాటు సత్యవేడులో ప్రజాదర్భారు, బంగారుపాళ్యం మండలంలో స్కూల్ పిల్లలను అభినందించటం వంటి కార్యక్రమాలు చేశారు.

ఇందులో ఏ ఒక్క దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేధు. కానీ ఒక క్యాబినెట్ మంత్రి క్యాబినెట్ సమావేశానికి డుమ్మా కొట్టి ఇలాంటి కార్యక్రమాలతో పాల్గొనటం ద్వారా ప్రజలకు..అధికారులకు ఎలాంటి సంకేతం పంపుతున్నారు అనే చర్చ సాగుతోంది. చూస్తుంటే మంత్రి నారా లోకేష్ ప్రకటనల్లో ఫోటో ల దగ్గర నుంచి క్యాబినెట్ కు డుమ్మా కొట్టే విషయంలో కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పోటీ పడుతున్నట్లు ఉంది అనే చర్చ టీడీపీ వర్గాల్లోనే ఉంది. గతంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఇలా కొన్ని సార్లు మంత్రి వర్గ సమావేశాలకు డుమ్మాకొట్టారు. ఒక సారి అనారోగ్యం కారణంగా అలా వచ్చి ..ఇలా వెళ్లిపోయారు. మరో సారి మాత్రం కారణాలు ఏమి చెప్పకుండానే మంత్రి వర్గ సమావేశానికి దూరంగా ఉన్నారు. అంతకు ముందు పార్టీ సమావేశాలతో పాటు ఇతర కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. దీంతోనే విమర్శలు వెల్లువెత్తాయి అప్పటిలో.

ఇప్పుడు చూస్తుంటే నారా లోకేష్ క్యాబినెట్ కు డుమ్మా కొట్టే విషయంలో కూడా పవన్ కళ్యాణ్ కంటే తాను ఏమి తక్కువ అన్న చందంగా వ్యవహరించినట్లు ఉంది ఒక సీనియర్ మంత్రి అభిప్రాయపడ్డారు. అందరూ కలిసి క్యాబినెట్ సమావేశం అంటే కామెడీ చేస్తున్నారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ రేపు మంత్రులు కూడా స్పెషల్ ఫ్లైట్స్ ..హెలికాప్టర్ టూర్లకు ఏ మాత్రం తగ్గటం లేదు. అందులో నారా లోకేష్ లాంటి వ్యక్తి క్యాబినెట్ సమావేశానికి అటెండ్ అయి స్పెషల్ ఫ్లైట్ లో అయినా హెలికాప్టర్ లో వెళ్లినా అడిగే వాళ్ళు ఉండరు అని..కానీ అలా చేయకుండా క్యాబినెట్ సమావేశం జరుగుతున్న రోజు ఇలా చేయటం సరికాదు అని అధికారులు కూడా అభిప్రాయపడుతున్నారు. మంత్రి వర్గ సమావేశానికి ఎంతో పవిత్రత ఉంటుంది అని ..ఇలా ఉప ముఖ్యమంత్రులు..మంత్రులు రకరకాల కారణాలతో డుమ్మా కొడుతూ పోతే ఇది తప్పుడు సంకేతాలు పంపుతుంది అని ఆ సీనియర్ మంత్రి స్పష్టం చేశారు. మరో కీలక మంత్రి పయ్యావుల కేశవ్ కూడా సీఎం చంద్రబాబు టూర్ ఉంది అనే కారణంతో క్యాబినెట్ సమావేశానికి హాజరు కాలేదు అని చెపుతున్నారు. అసలు గతంలో ఎప్పుడు సీఎం జిల్లాల పర్యటనకు వెళ్ళనట్లు..ఇదే తొలి సారి అయినట్లు మంత్రి వర్గ సమావేశానికి హాజరు కాకుండా ఉండటం ఏంటో అర్ధం కావటం లేదు అనే చర్చ సాగుతోంది. మరో మంత్రి సత్య కుమార్ విదేశీ పర్యటనలో ఉండటంతో ఆయన కూడా మంత్రి వర్గ సమావేశానికి హాజరు కాలేదు.

Next Story
Share it