విశాఖలో అమెరికన్ కాన్సులేట్

సీఎం జగన్ ఆశాభావం
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలో అమెరికన్ కాన్సులేట్ ఏర్పాటు కావాలన్నదే తమ అంతిమ లక్ష్యం అన్నారు. దేవుడి దయతో అది కార్యరూపం దాలుస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే జగన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు కన్పిస్తోంది. ఆంధా యూనివర్సిటీ(ఏయూ)లో ఏర్పాటు చేసిన 'అమెరికన్ కార్నర్' కేంద్రాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఏయూలో అమెరికన్ కార్నర్ ఏర్పాటు కావటం సంతోషకరమని అన్నారు. విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. అహ్మదాబాద్,హైదరాబాద్ తర్వాత విశాఖలో అమెరికన్ కార్నర్ ప్రారంభమైందని తెలిపారు.
దేశంలో మూడో కేంద్రంగా.. అమెరిన్ కాన్సులేట్ సహకారంతో విశాఖలో 'అమెరికన్ కార్నర్' ఏర్పాటు చేశారు. యూఎస్ విద్య, ఉద్యోగావకాశాల సమాచారానికి సంబంధించి సేవలు అందించనుంది. ఈ కార్యక్రమంలో అమెరికన్ కాన్సులేట్ జనరల్ జోయల్ రీఫ్మెన్, యూఎస్ ఎయిడ్ ఇండియా డైరెక్టర్ వీణా రెడ్డి, ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో అమెరికన్ కార్నర్ ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించిన అమెరికన్ కాన్సుల్ జనరల్ జోయల్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇందుకు తాము ఎప్పటికీ కృతజ్ఞులమై ఉంటామన్నారు.