తిరుమలలో భక్తులకు గదుల కేటాయింపు సులభతరం
కోట్లాది మంది భక్తులు కొలిచే ప్రముఖ దేవాలయం తిరుమలలో భక్తులకు గదుల కేటాయింపు మరింత సులభతరం కానుంది. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. జూన్ 12వ నుంచే భక్తులకు మరింత సులభంగా వసతి గదుల కేటాయింపు ప్రారంభం కానుంది. భక్తుల సౌకర్యార్థం జూన్ 12వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి తిరుమలలోని ఆరు ప్రాంతాల్లో నూతనంగా టిటిడి ఏర్పాటు చేసిన కౌంటర్లలో వసతి గదుల కొరకు పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని టిటిడి కల్పిస్తోంది. ఇప్పటి వరకు తిరుమలలోని వసతి కొరకు సిఆర్వో వద్ద పేర్లు రిజిస్ట్రేషన్ మరియు గదులు కేటాయిస్తున్న విషయం విదితమే.
శనివారం నుండి జిఎన్సి టోల్గేట్ వద్ద ఉన్న లగేజి కౌంటర్ నందు రెండు కౌంటర్లు, బాలాజి మెయిన్ బస్టాండ్ వద్ద రెండు కౌంటర్లు, కౌస్తుభం అతిథి భవనం వద్ద ఉన్న కారు పార్కింగ్ ప్రాంతంలో రెండు కౌంటర్లు, రాంభగిచ బస్టాండ్ వద్ద రెండు కౌంటర్లు, ఎమ్బిసి ప్రాంతంలోని శ్రీవారి మెట్టు వద్ద రెండు కౌంటర్లు, సిఆర్వో వద్ద రెండు కౌంటర్లలో భక్తులు వసతి కోరకు పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇక్కడ రిజిస్టర్ చేసుకున్న వారి ఫోన్లకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం పంపనున్నారు. సమాచారం అందిన వెంటనే తమకు కేటాయించిన గదులు ఉన్న ప్రాంతంలో నగదు చెల్లించి అందులో ఉండొచ్చు. ఇది భక్తులకు ఎంతో వెసులుబాటు ఇవ్వనుంది.