Telugu Gateway
Andhra Pradesh

టీడీపీ అధికార ప్రతినిధి దారుణ హత్య

టీడీపీ అధికార ప్రతినిధి దారుణ హత్య
X

కడప జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిని గొడ్డళ్ళతో నరికి చంపేశారు. ఈ ఘటనలో నందం సుబ్బయ్య అక్కడికి అక్కడే ప్రాణాలు వదిలారు. పట్టపగలు ఇళ్ళపట్టాల పంపిణి కార్యక్రమం వద్ద అందరు చూస్తుండగా దుండగులు సుబ్బయ్యను నరికి చంపారు. హతుడు సుబ్బయ్య గత కొంత కాలంగా అధికారపార్టీ శ్రేణుల అసాంఘిక కార్యక్రమాలపై సోషల్ మీడియా వేదికగా వరుసగా విమర్శలు ప్రతివిమర్శలు చేసుకున్నారు. రాజకీయ కోణంలోనే హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలికి చేరుకుని పోలీసులు విచారణ ప్రారంభించారు.

ఈ హత్యపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. బడుగు, బలహీన వర్గాలను నాయకులను భౌతికంగా అంతమొందించటమే లక్ష్యంగా వైసీపీ పనిచేస్తోందని ధ్వజమెత్తారు. చేనేత కుటుంబానికి చెందిన సుబ్బయ్య హత్య కిరాతక చర్య అని మండిపడ్డారు. ఇసుక అక్రమ రవాణా, క్రికెట్ బెట్టింగ్ లో వైసీపీ ఎమ్మెల్యే, ఆయన బావమరిది పాత్రను బహిర్గతం చేశాడనే కక్ష్యతోనే ఈ హత్యకు పాల్పడ్డారని చంద్రబాబు ఆరోపించారు. జగన్ సీఎం అయిన తర్వాత ప్రజలకు రక్షణ లేకుండా పోతోందని , గత 19 నెలల కాలంలో ఎంతో మంది టీడీపీ నేతలు, కార్యకర్తలు హత్యకు గురయ్యారని అన్నారు. రాష్ట్రాన్ని క్రిమినల్స్ కు అడ్డాగా మార్చారని ధ్వజమెత్తారు.

Next Story
Share it