Telugu Gateway
Andhra Pradesh

మర్డర్ కేసు కో న్యాయం...అవినీతి కేసు కు మరో న్యాయమా?

మర్డర్ కేసు కో న్యాయం...అవినీతి కేసు కు మరో న్యాయమా?
X

అది మర్డర్ కేసు అయినా...అవినీతి కేసు అయినా తప్పు చేసిన వాళ్లపై చర్యలు ఉండాల్సిందే. ఇందులో ఎవరికి మినహాయింపు ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామ కృష్ణ రెడ్డి మాత్రం మర్డర్ కేసు విషయంలో ఒకలాగా..అవినీతి కేసు లో మరోలా వాదనలు వినిపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సంచలనం రేపిన వై ఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో మీడియా సాక్షిగా సజ్జల రామకృష్ణ రెడ్డి చేసిన వాదనలు అందరూ చూసిందే. వివేకా హత్య కేసు లో కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ కు సిబిఐ ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఈ కేసు లో అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే అంతకు మించిన అన్యాయం మరొకటి ఉండదు అంటూ వ్యాఖ్యానించారు. ఇది అంతా కుట్ర..అసలు ఈ హత్య కేసు లో అవినాష్ రెడ్డి కి ఏ మాత్రం సంబంధం లేదు అంటూ వాదించారు. కానీ ఇప్పుడు మాత్రం స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో చంద్రబాబు అరెస్ట్ విషయంలో మాత్రం చంద్రబాబు కోర్ట్ లో అయన తన నిజాయతీని నిరూపించుకోవాలని వ్యాఖ్యానిస్తున్నారు. మర్డర్ కేసు లో అరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డి కి మాత్రం సజ్జల రామకృష్ణ రెడ్డి సర్టిఫికెట్స్ ఇచ్చేస్తారు. అంతే కాదు...సిబిఐ విచారణ తీరును కూడా ఆయన తప్పుపట్టారు. చంద్రబాబు ప్రోద్బలంతో ఇలా వ్యవరిస్తున్నారు అంటూ ఆరోపించారు. ఎక్కడా అధికారంలో లేని చంద్రబాబు మాటలే సిబిఐ వినేట్లు అయితే ...ఆంధ్ర ప్రదేశ్ లో అధికారంలో ఉన్న జగన్ సర్కారు మాటలను అయన కింద పనిచేసే సిఐడి వినదా?. ఇప్పుడు మాత్రం కేంద్ర విచారణ సంస్థ ఈడీ విచారణ అంటే చాలా పర్ఫెక్ట్ అంటూ వాదిస్తున్నారు.

వివేకా హత్య కేసు లో అప్రూవర్ గా మారిన దస్తగిరి మాటలను సిబిఐ ఎలా పరిగణనలోకి తీసుకుంటుంది అని సజ్జల రామకృష్ణ రెడ్డి దగ్గర నుంచి పలువురు వైసీపీ నేతలు ప్రశ్నించారు. కానీ ఢిల్లీ లిక్కర్ స్కాం విషయానికి వస్తే మొదటి నుంచి తమకు అసలు దీంతో ఏ మాత్రం సంబంధం వాదిస్తూ వచ్చిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి తాజాగా అప్రూవర్ గా మారినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అంతకు ముందు అయన తనయడు రాఘవ కూడా అప్రూవర్ గా మారారు. అసలు ఈ కేసు తో ఏ మాత్రం సంబంధం లేదు అన్న వాళ్ళు అప్రూవర్ లు గా ఎలా మారారు?. ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ సొంత బాబాయ్ వై ఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయానికి వచ్చేవరకు మాత్రం కేంద్ర విచారణ సంస్థలపై పలు అనుమానాలు లేవనెత్తుతారు. కానీ చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ స్కాం విషయంలో వచ్చేసరికి మాత్రం కేంద్ర విచారణ సంస్థల నివేదికలకు సర్టిఫికెట్స్ ఇస్తారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం విషయంలో చంద్రబాబు అరెస్ట్ అయినందున ఖచ్చితంగా ఆయన కోర్ట్ లోనే తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. సజ్జల రామకృష్ణ రెడ్డి మాత్రం తమ నాయకుల కేసు ల విషయంలో ఒకలా...ఇతర కేసుల విషయంలో మరోలా మీడియా సాక్షిగా మాట్లాడటమే విచిత్రం.

Next Story
Share it