Telugu Gateway
Andhra Pradesh

అమిత్ షాతో ర‌ఘురామ‌రాజు భేటీ

అమిత్ షాతో ర‌ఘురామ‌రాజు భేటీ
X

వైసీపీ రెబ‌ల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మంగ‌ళ‌వారం నాడు ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ త‌రుణంలో అమిత్ షాతో ఆయ‌న భేటీ కావ‌టం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. రఘురామ గ‌త కొంత కాలంగా ప‌లు వివాదాల‌కు కేంద్ర బిందువుగా మారారు. వైసీపీ ఆయ‌న‌పై అన‌ర్హ‌త వేటు వేయాల్సిందిగా లోక్సభ స్పీక‌ర్ ఓం బిర్లాకు ప‌లుమార్లు ఫిర్యాదులు చేయ‌టం..ఆయ‌న‌కు తాజాగా నోటీసులు కూడా జారీ అయ్యాయి. ఈ త‌రుణంలో భేటీ ప్రాదాన్య‌త సంత‌రించుకుంది. అమిత్ షాతో భేటీ సంద‌ర్భంగా ఏపీలో రాజకీయ పరిస్థితులు, పార్లమెంట్ సమావేశాలపై చర్చించారు. ఈ సందర్భంగా రఘురామ ఆరోగ్య పరిస్థితులపై అమిత్ షా అడిగి తెలుసుకున్నార‌ని స‌మాచారం.

అంత‌కు ముందు రఘురామకృష్ణంరాజు మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా అంశంపై సీఎం ఆదేశిస్తే రాజీనామాకు ఎంపీలందరం సిద్ధమని రఘురామ ప్రకటించారు.''నాపై అనర్హత వేటు పడదు. మీ బెయిల్ రద్దు చేయమని అనడం రాజద్రోహం ఎలా అవుతుంది. వాట్సాప్‌లో చాటింగ్ బయట పెట్టామని అంటున్నారు.. నా ఫోన్ పోలీసులు తీసుకున్నారు. పెగసెస్ సాఫ్ట్‌వేర్ మీరు తెప్పించారని అంటున్నారు. మీరు చాలా మందిపై వాడారని అంటున్నారు, మీరు కేంద్రం అనుమతి తీసుకున్నారా?'' అని రఘురామ ప్రశ్నించారు.

Next Story
Share it