Telugu Gateway
Andhra Pradesh

ఇది హెచ్చరిక సంకేతమా?

ఇది హెచ్చరిక సంకేతమా?
X

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు రూట్ మార్చారు. బీజేపీ కేంద్ర నాయకత్వం తప్పు తెలుసుకుని తన నిర్ణయాన్ని సరిదిద్దుకుంటే ఓకే అని...లేక పోతే తనకు న్యాయం చేయాల్సిన బాధ్యత టీడీపీ, జనసేన ల మీదే ఉంది అని బాంబు పేల్చారు. వేరే సీట్లు కాదు..తనకు నర్సాపురం లోక్ సభ సీటు వాళ్ళే ఇవ్వాలి అంటూ టీడీపీ, జనసేన లపై బాధ్యత వేశారు. బీజేపీ ఆడిన మాట తప్పి సీటు ఎగ్గొడితే.. ఆ పార్టీ తో మాట్లాడి ఒక సీటు ఇవ్వలేని వాళ్ళు రేపు కేంద్రంతో పోరాడి పోలవరం కడతారు...రాష్ట్రం కోసం ఇంకేదో తీసుకొస్తారు అంటే ఎవరైనా నమ్ముతారా అంటూ సంచనలన వ్యాఖ్యలు చేశారు. నిన్ను నమ్ముకున్నోడికి, ప్రజల కోసం పనిచేసినోడికి, చావు దాకా వెళ్ళివచ్చినవాడికి సీటే తెచ్చుకోలేకపోయావు అన్న చర్చ రాదా అని ప్రశ్నించారు. అయితే ఆ పరిస్థితి రాదు అని భావిస్తున్నట్లు చెప్పారు. తన సీటు తనకు వెనక్కి ఇస్తారు అని...ఒక వేళ వాళ్ళు న్యాయం చేయకపోతే తనకు న్యాయం చేయాల్సిన బాధ్యత టీడీపీ దే అన్నారు.

ఇంత కాలం అధికార వైసీపీ ని ఎటాక్ చేసిన రఘురామకృష్ణంరాజు ఇప్పుడు బీజేపీ సీటు ఇవ్వకపోవటంతో కూటమి పార్టీలపై ఎటాక్ స్టార్ట్ చేశారు. ఒక సారి బీజేపీ నర్సాపురం లోక్ సభ నుంచి శ్రీనివాస వర్మ పేరు ప్రకటించిన తర్వాత ఇప్పుడు టీడీపీ, జనసేనలు ఆయనకు అక్కడ సీటు కేటాయించటం అన్నది జరిగే పనికాదు అన్నది అందరికి తెలిసిందే. అయితే టీడీపీ రఘురామకృష్ణంరాజుకు ప్రత్యామ్నాయ సీట్లు చూస్తుంది అని వార్తలు వస్తున్న వేళ అయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.ఈ తరుణంలో రఘురామకృష్ణంరాజు సీటు సమస్యను పరిష్కరించటం కూటమి పార్టీలకు అత్యంత కీలకం కానుంది. తాజాగా అయన చేసిన వ్యాఖ్యలు టీడీపీ, జనసేనలకు హెచ్చరిక సంకేతాలు అన్న చర్చ కూడా సాగుతోంది.

Next Story
Share it