Telugu Gateway
Andhra Pradesh

వైసీపీని..ప్ర‌భుత్వాన్ని ఇరుకున‌పెట్టాల‌ని చూస్తున్నారు

వైసీపీని..ప్ర‌భుత్వాన్ని ఇరుకున‌పెట్టాల‌ని చూస్తున్నారు
X

ఏపీ అసెంబ్లీలో శుక్ర‌వారం నాడు జ‌రిగిన ప‌రిణామాలు కొత్త మ‌లుపు తిరుగుతున్నాయి. అసెంబ్లీలో త‌న భార్య‌ను కించ‌ర‌ప‌ర్చారంటూ చంద్ర‌బాబు మీడియా స‌మావేశంలో క‌న్నీరుపెట్టుకున్న విష‌యం తెలిసిందే. దీనిపై శ‌నివారం నాడు బాల‌క్రిష్ణ‌, జూనియ‌ర్ ఎన్టీఆర్ తోపాటు ఇత‌ర ఎన్టీఆర్ కుటుంబ స‌భ్యులు అంద‌రూ కూడా ప్ర‌భుత్వ తీరును ఖండిస్తూ వ‌ర‌స ప్ర‌క‌ట‌న‌లు చేశారు. దీంతో స‌ర్కారు కూడా రంగంలోకి దిగింది. మంత్రి పేర్ని నాని ఈ అంశంపై మాట్లాడారు. 'అసెంబ్లీ చర్చ అందరి దగ్గరా ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి. వైసీపీని, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూస్తున్నారు. బాలకృష్ణ, ఇతర కుటుంబ సభ్యులు కూడా నిజంగానే త‌మ వాళ్ళు ఏదో అన్నారు అని నమ్మారు. వారి బుర్రలో విషం ఎక్కించటానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఏదేదో జరిగినట్టు నమ్మించే నేర్పరితనం చంద్రబాబు సొంతం. ప్రశాంతమైన వాతావరణంలో వ్యవసాయ అంశాలపై స‌భ‌లో చర్చ జరుగుతోంది.

ఈలోపు జగన్, ఆయన కుటుంబ సభ్యులను ప్రస్తావిస్తూ చంద్ర‌బాబు మాట్లాడారు. ఇలాంటి పనుల వల్ల రాష్ట్ర రాజకీయాలను‌ ఎలాంటి పరిస్థితులకు తీసుకుని వెళ్తున్నారు'అని మంత్రి పేర్ని ప్రశ్నించారు. 'బాలకృష్ణ అమాయక చక్రవర్తి.. కానీ చంద్రబాబు ఏం చెప్తే అదే నిజమని అయన అనుకుంటున్నారు. అందరి ఇళ్లల్లో ఆడవారు ఉన్నారు. ‌అలాంటిది మేము ఎందుకు తిడతాము.. అసలు అసెంబ్లీలో వ్యవసాయం మీద చర్చ జరుగుతుంటే దానిపై ఒక్క ప్రశ్న అయినా వేశారా.. అనవసర మాటలతో రాద్దాంతం చేసింది చంద్రబాబు' అంటూ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో ఎవరూ చంద్రబాబు కుటుంబ సభ్యులు, వారి శ్రీమతి ప్రస్తావనే తేలేద‌న్నారు.

రాజకీయాలను రాజకీయంగానే ఎదుర్కోవాలి. దాన్ని పక్కన పెట్డి మెలోడీ డ్రామా కోసం కుటుంబ సభ్యులను తెచ్చారు. చంద్రబాబు కుటుంబ సభ్యులను ఎవరు.. ఏమన్నారో చెప్పాలి. చంద్రబాబు మాటలను వీడియో చేశారు కదా. అందులో ఎక్కడైనా దూషణల గురించి ఉందా. అనని మాటని, జరగని విషయాన్ని చెడుగా చిత్రీకరించి రాజకీయంగా వాడుకోవటం దురదృష్టకరం. రాజకీయాలు ఈ స్థితికి దిగజారటానికి కారణం చంద్రబాబే. తెలుగు రాజకీయాలు చూసేవారికి మరోసారి చెప్తున్నాం. చంద్రబాబు కుటుంబ సభ్యుల గురించి ఎవరూ మాట్లాడలేదు అని పేర్ని నాని తెలిపారు. వివేకా హత్య జరిగినప్పుడు ప్రభుత్వం నడుపుతున్నది ఎవరు. ముద్దాయిలను అప్పుడే ఎందుకు అరెస్టు చేయలేదు. అసెంబ్లీలో మైకు కట్ చేసినా క్షణాల్లో సెల్ ఫోన్‌లో ఎలా వీడియో తీశారు. ఇదంతా ప్రీప్లాన్ గా చేసిన వ్యవహారం. చంద్రబాబు చేతిలో ఇంకా మోసపోవద్దని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను కోరుతున్నాం. ఏపీ రాజకీయాల్లో నిన్నటిరోజు నిజంగానే బ్లాక్ డే అన్నారు.

Next Story
Share it